టీడీపీలో చిచ్చు: మేయర్ అభ్యర్థిగా కేశినేని కూతురు, బొండా ఉమ అసంతృప్తి

By telugu teamFirst Published Feb 27, 2021, 11:16 AM IST
Highlights

విజయవాడ టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా చల్లారలేదు. ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత మేయర్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించడానికి బొండా ఉమ మరో ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ తెలుగుదేశం పార్టీ మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఇంకా తగ్గలేదు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో విజయవాడ నేతలను బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం రంగంలోకి దిగింది. 

శుక్రవారం వరకు 39వ డివిజన్ అభ్యర్థి విషయంలో విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, ఎంపీ కేశినేని నాని మధ్య తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. ఆ ముగ్గురిని పిలిపించి టీడీపీ అధినేత చంద్రబాబు రాజీ చేశారు.  చివరకు నాని సూచించిన శివశర్మను అభ్యర్థిగా ఖరారు చేశారు. 

ఆ తర్వాత మరో డివిజన్ అభ్యర్థి విషయంలో విభేదాలు ప1డసూపాయి. 11 డివిజన్ నుంచి కేశినేని నాని కూతురు శ్వేత కార్పోరేటర్ గా పోటీ చేస్తున్నారు విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను ఖరారు చేయడంతో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, టీడీపీ ఏపి నేత అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నచ్చజెప్పడంతో బొండా ఉమామహేశ్వర రావు వెనక్కి తగ్గారు. 

అయితే, 30 డివిజన్ అభ్యర్థిగా గోగుల రమణను కాకుండా గరిమెళ్ల చిన్నాను ఖరారు చేయాలని ఆయన షరతు పెట్టారు. ఈ ప్రతిపాదనపై కేశినేని నానితో టీడీపీ అగ్ర నాయకులు మాట్లాడుతున్నారు. 

click me!