శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత కీలకమైన గరుడ సేవ నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారుతోంది. ఇప్పటికే కొండ పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేశారు అధికారులు.
తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి వేలాది మంది తరలివస్తున్నారు. దీంతో కొండ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వాహనాల పార్కింగ్ కూడా స్థలం లేదు. దీంతో అలిపిరి వద్దే వాహనాలను నిలిపివేస్తున్నారు పోలీసులు. అలిపిరి నుంచి కపిలతీర్థం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పార్కింగ్ పాస్లు వున్నప్పటికీ ఎవ్వరినీ అనుమతించడం లేదు.
కాగా... తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత కీలకమైన గరుడ సేవ అక్టోబర్ 1న జరగనుంది. కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత గరుడ సేవలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలకు బైక్లను నిషేధించారు అధికారులు. అలాగే భక్తుల సౌకర్యార్ధం ఏడు ప్రాంతాల్లో హెల్ప్ లైన్ డెస్కులు ఏర్పాటు చేశారు. సులువుగా మాడ వీధుల్లోకి ప్రవేశించేందుకు గాను సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కూడా తిరుమలకు 5,044 ట్రిప్పులతో దాదాపు 2 లక్షల మంది భక్తులను తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.