అమూల్ కోసమే దూళిపాళ్ళ టార్గెట్...బందిపోటు, గూండాలా అరెస్ట్: దేవినేని ఉమ

By Arun Kumar PFirst Published Apr 23, 2021, 12:31 PM IST
Highlights

అమూల్ ను భుజానికెత్తుకున్నముఖ్యమంత్రి జగన్ దూళిపాళ్ల నరేంద్రను లక్ష్యంగా ఎంచుకున్నాడని...అందుకోసమే సంగం డెయిరీలో లేని అవినీతిని ఉన్నట్లు చూపడానికి  ప్రయత్నిస్తున్నాడని అన్నారు. 

విజయవాడ: ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్ష నేతలను తొక్కిపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలంతా బిక్కుబిక్కుమంటుంటే ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఆరోపించారు. తెల్లవారుజామున ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికెళ్లి ఒక బందిపోటుని, గూండాను అరెస్ట్ చేసినట్లు వ్యవహరించారని ఉమ మండిపడ్డారు.

''సంగం డెయిరీని స్థాపించి పాడిరైతులకు అండగా ఉండటమే నరేంద్ర చేసిన తప్పా? సంగం డెయిరీని రూ.1100కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లడమే నరేంద్ర చేసిన తప్పా? నరేంద్ర ప్రభుత్వ  తప్పుడుకేసులను ఎత్తిచూపి, వాస్తవాలు బయటపెట్టడంతో ముఖ్యమంత్రి ఆయనపై కక్ష కట్టాడు'' అన్నారు. 

''అమూల్ ను భుజానికెత్తుకున్న నరేంద్రను లక్ష్యంగా ఎంచుకున్నాడు ముఖ్యమంత్రి. సంగం డెయిరీలో లేని అవినీతిని ఉన్నట్లుచూపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అక్రమకేసులు, తప్పుడు కేసులతో ముఖ్యమంత్రి ఒక శాడిజంతో, పైశాచిక ఆనందంతో, సైకోలా ప్రవర్తిస్తున్నాడు'' అని విమర్శించాడు. 

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ : తీవ్రవాదా.. ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా?.. మండిపడుతున్న నేతలు..

''అమరావతి భూముల వ్యవహరంలో చంద్రబాబునాయుడు, మాజీమంత్రి నారాయణలపై పెట్టినవన్నీ తప్పుడుకేసులేనని నరేంద్ర ఆధారాలతో సహా నిరూపించాడు. దాంతో ముఖ్యమంత్రి నరేంద్రను టార్గెట్ గా చేసుకున్నాడు.  నరేంద్రను తక్షణమే మీడియా సాక్షిగా కోర్టులో హాజరుపరచాలి. లేకుంటే టీడీపీ తరుపున పెద్దఎత్తున ఉద్యమిస్తాం'' అని ఉమ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

''తన దోపిడీకోసం జగన్మోహన్ రెడ్డి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చేశాడు. అంచనా వ్యయం పెంచి రాత్రికి రాత్రి జీవోలిచ్చి రూ.3222కోట్లకు ఎసరు పెట్టాడు. అమరావతిని నిర్వీర్యంచేసిన జగన్మోహన్ రెడ్డి కన్ను ఇప్పుడు పోలవరంపై పడింది'' అన్నారు.

''ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యముంటే కరోనాతో బాధపడుతున్న రోగులవద్దకు రావాలి. వైరస్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించాలి. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రినైనా ముఖ్యమంత్రి ఎందుకు సందర్శించడంలేదు? కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఎందుకు సమీక్ష చేయడంలేదు?'' అంటూ దేవినేని ప్రశ్నించారు. 

click me!