ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుపై మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు సంచలన ఆరోపణ చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుపై మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు సంచలన ఆరోపణ చేశారు. వంగవీటి రంగా హత్యలో మాస్టర్ ప్లాన్ దేవినేని ఉమదేనని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్ాలలో హత్యలు చేయించేది, వాటిని ప్రోత్సహించేది ఎవరో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
రోజుకొక పార్టీ మారుతూ, ఆస్తుల కోసం హత్యలు చేసే హంతకులు డబ్బు సంచులతో వస్తున్నారంటూ తనపై, కృష్ణప్రసాద్పై దేవినేని ఉమ చేస్తున్న ఆరోపణలపై వసంత నాగేశ్వర రావు ప్రతిస్పందించారు. కంచికచర్లలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
హత్యలు చేసి జైళ్లకెళ్లింది దేవినేని ఉమ కుటుంబ సభ్యులేనని అన్నారు. దేవినేని ఉమా వదిన ఎలా చనిపోయిందో, ఎవరి హస్తముందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కంచికచర్ల, వీరులపాడు మండలాలకు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి కూడా సాగునీరు ఇవ్వలేదని, ఉమా అంతటి అసమర్థుడు మరొకరు లేరని ఆయన అన్నారు.