ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీపీఐ తీర్మానం చేసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని విజయవాడలో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభ తీర్మానించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీపీఐ తీర్మానం చేసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని విజయవాడలో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభ తీర్మానించింది. ఈ తీర్మానానికి జాతీయ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా సీపీఐ డిమాండ్ చేసింది.
ఏపీ రాజధాని అంశంపై మాట్లాడిన సీపీఐ నేత నారాయణ.. అమరావతి రాజధానిగా ఉండాలని సీపీఐ ముందు నుంచే చెబుతుందని అన్నారు. మద్రాసు నుంచి బయటకు వచ్చినప్పుడే తమ పార్టీ విజయవాడ రాజధాని కావాలని కోరిందన్నారు. ఏపీ పునర్విభజన తర్వాత.. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండాలని.. టీడీపీ కంటే ముందే సీపీఐ మాట్లాడిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినప్పటికీ.. రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.
గతంలో టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే.. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మద్దతు తెలిపారని చెప్పారు. ఆ రోజు వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉందని గుర్తుచేశారు. అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని అన్నారు. వైసీ ప్రభుత్వమే మూడు రాజధానుల ఉద్యమం జరుపుతోందని ఆరోపించారు. విశాఖలో భూ స్కామ్లపై సీబీఐ విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.