కరోనా ఎఫెక్ట్... రాజమండ్రి సెంట్రల్ జైల్ ఖైధీలకు స్పెషల్ బెయిల్

By Arun Kumar PFirst Published May 23, 2021, 8:50 AM IST
Highlights

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అర్హత కలిగిన ఖైధీలను బెయిల్ పై విడుదల చేస్తున్నట్లు సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. 

రాజమండ్రి: కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోని 21మంది ఖైదీలకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అర్హత కలిగిన ఖైధీలను బెయిల్ పై విడుదల చేస్తున్నట్లు సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. బెయిల్ కోసం మొత్తం మొత్తం 45 మంది ఖైదీలు దరఖాస్తు చేసుకోగా 21మందిని మాత్రమే అర్హులుగా తేల్చి బెయిల్ మంజూరు చేశారు. 

జైళ్లలో కూడా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న ఇద్దరు న్యాయమూర్తులు అక్కడి ఖైధీలకేసుల పూర్వాపరాలను పరిశీలించి 21 మంది బెయిల్ కు అర్హులుగా తేల్చారు. వీరిలో నలుగురు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, 17 మంది రిమాండ్‌లో ఉన్నారు. 

read more   ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా టీకా... జనం ఊరుకోరు: ప్రధానికి జగన్ ఘాటు లేఖ

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కాకపోతే గత రెండ్రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసులు తగ్గాయి. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో అధికార యంత్రాంగం తల పట్టుకుంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 19,981 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

 వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,62,060కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 118 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,022కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 11, చిత్తూరు 14, గుంటూరు 10, కర్నూలు 7, నెల్లూరు 7, కృష్ణ 9, విశాఖపట్నం 11, శ్రీకాకుళం 8, పశ్చిమ గోదావరి 15, ప్రకాశం 7, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

 ఒక్కరోజే కరోనా నుంచి 18,336 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 13,41,355కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 90,609 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,85,25,758కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,10,683మంది చికిత్స పొందుతున్నారు.

అనంతపురం 1787, చిత్తూరు 2581, తూర్పుగోదావరి 3227, గుంటూరు 1040, కడప 893, కృష్ణ 1064, కర్నూలు 1161, నెల్లూరు 912, ప్రకాశం 1295, శ్రీకాకుళం 1338, విశాఖపట్నం 2308, విజయనగరం 838, పశ్చిమ గోదావరిలలో 1537 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 


 

click me!