
ప్రకాశం: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే ప్రారంభమైన స్కూళ్లలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. చాలా జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కరోనా బారిన పడుతుండటంతో ఆందోళన మొదలయ్యింది. ఒక్క ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 156పాజిటిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న(శనివారం) ఒక్కరోజే 20మంది (నలుగురు టీచర్లు, 16మంది స్టూడెంట్స్) కరోనా బారినపడటం ఆందోళనను మరింత పెంచింది.
జిల్లాలోని మద్దిపాడు మండలం నేలటూరు పాఠశాలలో నలుగురు, ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్లో నలుగురు, కొండపి మండలం పెట్లూరు జడ్పీ హైస్కూల్లో ముగ్గురు, పొన్నలూరు మండలం పి. అగ్రహారం స్కూల్లో నలుగురు, విప్పగుంట ఉన్నత పాఠశాలలో ఒకరు, కనిగిరి ఫస్ట్ వార్డ్ లోని పాఠశాలలో ఇద్దరు, నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం స్కూల్లో ఒకరు, హెచ్. నిడమనూరు ఎయిడెడ్ స్కూల్లో ఒకరు చొప్పున మొత్తం 20మంది కరోనా బారిన పడ్డారు.
ఇలా కరోనా కేసులు బయటపడ్డ ఆయా పాఠశాలల్లో పరిస్థితిని విద్యాశాఖ, వైద్యశాఖ అధికారులు పరిశీలించి వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకు స్కూళ్లలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
read more నెల్లూరులో కరోనా విలయం.. ఏపీలో మళ్లీ 1500 మార్క్ దాటిన కేసులు, 20,16,807కి చేరిన సంఖ్య
ఇక గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పది మంది కరోనా బారినపడ్డారు. వీటిలో పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కొవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. అలాగే బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా తేలింది.
వారిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నలుగురు, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఒకరు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించారు. పాఠశాల మొత్తాన్ని శుభ్రం చేసి రసాయనాన్ని స్ప్రే చేశారు.
మరోవైపు కరోనా నేపథ్యంలో గురు పూజోత్సవాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. గురుపూజోత్సవం, ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవాన్ని రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.