YS Jagan: సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కాన్వాయ్‌ను నిలిపివేసిన జగన్ ఏం చేశారంటే..

By team teluguFirst Published Nov 14, 2021, 5:13 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (ys jagan mohan reddy) కాన్వాయ్ వెంట ఓ మహిళా పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్‌ను నిలిపివేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రేణిగుంట (renigunta) ఎయిర్‌పోర్ట్ సమీపంలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లాలోని రేణిగుంట (renigunta) ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (ys jagan mohan reddy) కాన్వాయ్ వెంట ఓ మహిళా పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్‌ను నిలిపివేశారు. తన ఓఎస్డీని పంపి సమస్య ఏమిటో తెలుసుకోవాలని చెప్పారు. వివరాలు సదరన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం వైఎస్ జగన్.. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలోని తాజ్ హోటల్‌కు బయలుదేరారు. 

అయితే వైఎస్ జగన్ కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్‌ బయటకు రాగానే.. ఓ మహిళ కాన్వాయ్ వెంబడి పరుగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్‌ కాన్వాయ్‌కి నిలిపివేయించి.. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ఆ మహిళ దగ్గరకు పంపించారు. సమస్య ఏమిటో తెలుసుకోవాలని చెప్పారు. దీంతో ఓస్‌డీ ఆమె వద్దకు సమస్యను తెలుసుకున్నారు. ఆమె తనకు ఉద్యోగం కావాలని, స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నానని తెలిపింది. ఆమె వద్ద నుంచి వినతి పత్రం స్వీకరించిన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. 

Also read: తిరుపతిలో ప్రారంభమైన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం: అతిథులను సన్మానించిన జగన్

ఆ మహిళను కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారిగా గుర్తించారు. విజయకుమారి ఒక చిన్న ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనారోగ్యం, వయసు భారం పెరుగుతుండటంతో కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం కావాలని విజయకుమారి కోరింది. సీఎం ఓఎస్డీ వచ్చి తన సమస్యను తెలుసుకోవడంతో ఆమె ఆనందం వ్యక్తం చేసింది. సీఎం జగన్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపింది.

ఇక, సీఎం వైఎస్ జగన్  సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు తాడేపల్లి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరుపతికి బయలుదేరారు. మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో సీఎం జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు తాజ్ హోటల్‌కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశం రాత్రి 7.30 గంటల వరకు కొనసాగనుంది.

click me!