
రాష్ట్రంలో హౌసింగ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంలో వెనుకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంట్, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. కాలనీల పరంగా ప్రాధాన్యత పనులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని పనులు చేపట్టాలని సూచించారు.
టిడ్కో ఇళ్ల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సీఎం జగన్కు అధికారులు వివరించారు. ఇప్పటికే పనులు పూర్తైన వాటిని లబ్దిదారులకు అందిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నాటికి అన్నింటినీ కూడా లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఇక, ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.