పఠాన్ కోట్ పేలుడు బాధితుడికి రు. 10 లక్షల చెక్కు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంటిస్థలం మంజూరుకు అదేశాలు
ఆ మధ్య పఠాన్ కోట్ లో జరిగిన బాంబు పేలుడు బాధితుడు, శ్రీకాకుళం జిల్లా కు చెందిన శ్రీరాములుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10 లక్షల సహాయం చేశారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో తనను కలసిన శ్రీరాములుకు రూ.10 లక్షల చెక్ను స్వయంగా అందజేశారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తగిన స్థలాన్ని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా వంగర మండలలం వోని అగ్రహారం గ్రామానికి చెందిన కె. శ్రీరాములు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ ఎస్ జి)లో పనిచేస్తున్నాడు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై గత జనవరిలో తీవ్రవాదుల దాడి తర్వాత శ్రీరాములుకు అక్కడ విధినిర్వహణ అప్పగించారు. మరణించిన పాక్ తీవ్రవాదుల దగ్గర ఉన్న బాంబులు నిర్వీర్యం చేసేయత్నంలో ఒక బాంబు ప్రమాదవశాత్తూ పేలి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఆర్.ఆర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. కోమాలోకి వెళ్లి కోలుకున్నాడు.
శరీరంలో బాంబు శకలాలను శస్త్రచికిత్స ద్వారా చాలావరకు తీసివేశారు. మిగిలినవాటిని తీస్తే ప్రాణాపాయమని వైద్యనిపుణులు హెచ్చరించారు. తీవ్రంగా గాయపడి కోలుకున్న శ్రీరాములు, శరీరంలో మిగిలిన బాంబు శకలాలతో ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తున్నారు.
ఉద్యోగం చేయలేని స్థితికి గురైన తనను ఆదుకోవాలని, తన కుటుంబానికి దారి చూపాలని గతనెల 25న శ్రీరాములు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుని విజ్ఞప్తి చేశారు. అపుడు ముఖ్యమంత్రి రూ. 10 లక్షల సహాయం ప్రకటించారు. శ్రీరాములు విషయాన్ని వెలుగులోకి తెచ్చిన శ్రీకాకుళం జిల్లా లక్ష్మి ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ టి. ప్రసాదరావు... శ్రీరాములును ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువచ్చారు.