
మనిషికి బీమా ఉన్నట్లే పంటకు బీమా ఉండకపోతే రైతు పరిస్థితి ఏంత దయనీయంగా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో చూశామని ఆంధరప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాలో 2021 ఖరీఫ్కు సంబంధించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో బీమా సొమ్ము జమ అవుతోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3,411 కోట్ల పంట బీమా మాత్రమే ఇచ్చారని.. ఈ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.6,685 కోట్ల బీమా చెల్లించిందని చెప్పారు. రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే తీర్చిందన్నారు. ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
ఇక, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబానికి పరిహారం ఇచ్చామని తెలిపారు. సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి కూడా పరిహారం ఇచ్చామని చెప్పారు. పరిహారం అందని కౌలు రైతు కుటుంబాన్ని చూపించమని సవాల్ విసిరితే చూపించలేకపోయారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 458 మంది రైతు కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వ పాలనలోనే పరిహారం ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో దత్తపుద్రుడికి రైతుల ఇళ్లకు వెళ్లాలని గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు.
మోసం చేయడంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు తోడు దొంగలు అని విమర్శించారు. చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందాన అంటాడని ఎద్దేవా చేశారు.ఈనాడు, చంద్రబాబు, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు ఏకమై ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చేస్తారు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందో.. అది చేయడానికి దత్తపుత్రుడు ఉరుకులు, పరుగులు తీస్తాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా అని ప్రశ్నించారు.
కొనసీమ క్రాప్ హాలిడే అంటూ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వాళ్లు పెట్టిన బకాయిలను చెల్లించినందుకు రైతుల్ని రెచ్చగొడుతున్నారా అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలో 67 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని గుర్తుచేశారు. అక్కడ కూడా విద్యార్థులును రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుజరాత్లో 65 శాతమే పాస్ అయ్యారని చెప్పారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడాల్సింది పోయి.. విద్యార్థులను సైతం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు.. సప్లిమెంటరీలో పాస్ అయిన రెగ్యులర్గానే పరిగణించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక, అనంతరం 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల పంట బీమా పరిహారాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.