మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఓదార్చారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు కిడారి కుటుంబ సభ్యులకు, సోమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.
విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఓదార్చారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు కిడారి కుటుంబ సభ్యులకు, సోమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఎస్టీ ఎమ్మెల్యేను కాల్చి చంపడం అమానుషమన్నారు. పరమేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బిడ్డలకు అన్నివిధాలా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సర్వేశ్వరరావు మృతితో ఆ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్న చంద్రబాబు ఆయన ఆశయాల సాధన కోసం కృషిచేయడమే సరైన నివాళి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇందుతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ఏజెన్సీలో టీడీపీ బలోపేతానికి సోమ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఆయన మృతి తెదేపాకు తీరనిలోటన్నారు. గుండె దిటవు చేసుకోవాలని ఇందును ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, సోమ ఆశయాల సాధనకు కృషిచేయాలని కోరారు.