ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వారి జాబితాలో చంద్రబాబునాయుడు పేరు లేనే లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. యూఎన్వోలో చర్చకు సంబంధించిన 313 అంశాల్లోనూ చంద్రబాబు చెప్పిన స్థిరమైన వ్యవసాయానికి ఆర్థిక సహాయం-పరిష్కారాలు అనే అంశమే లేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమెరికా పర్యటనపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.
ఏలూరు: ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వారి జాబితాలో చంద్రబాబునాయుడు పేరు లేనే లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. యూఎన్వోలో చర్చకు సంబంధించిన 313 అంశాల్లోనూ చంద్రబాబు చెప్పిన స్థిరమైన వ్యవసాయానికి ఆర్థిక సహాయం-పరిష్కారాలు అనే అంశమే లేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమెరికా పర్యటనపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.
చంద్రబాబు అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అమెరికాలో చంద్రబాబు ఎక్కడ ప్రసంగిస్తారో సమాచారం లేదన్నారు. చంద్రబాబు మాట్లాడే సమావేశాన్ని వెబ్లింక్లో పెడితే చూస్తామన్నారు. చంద్రబాబు పర్యటనపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అమెరికా పర్యటన పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు చంద్రబాబుకు అనుమతి ఉందా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, బ్యాంకులతో ఏపీకి రూ.16వేల కోట్ల రుణ ఒప్పందం జరిగిందని ఈ ఒప్పందం పనిమీదనే చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు.