మొత్తానికి భాజపా నేత పురంధేశ్వరి సాధించారు. చంద్రబాబునాయుడు సొంతజిల్లా చిత్తూరులో ఓ మాజీ ఎంఎల్ఏని పార్టీలోకి లాక్కోవటంలో సక్సెస్ అయ్యారు. అందులోనూ చంద్రబాబుకు బద్ద విరోధిని భాజపాలోకి లాక్కోవటం గమనార్హం. గడచిన మూడున్నర సంవత్సరాలుగా ఆకర్ష్ పేరిట భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతర పార్టీల్లో నుండి భాజపాలోకి చేరటానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపని సమయంలో సికెబాబుతో పురంధేశ్వరి వారం క్రితం కలిసి చర్చలు జరిపిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తానికి డీల్ ఏంటన్నది పక్కన బెడితే పురంధేశ్వరి విజయం సాధించారు.
చిత్తూరు మాజీ ఎంఎల్ఏ సికె జయచంద్రారెడ్డి (బాబు) మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సికె బాబు దంపతులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో పురందరేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంపై నమ్మకంతోనే తాము భాజపాలో చేరినట్లు సికే.బాబు దంపుతులు తెలిపారు. కంభంపాటి మాట్లాడుతూ, సికె బాబు తదితరులను బిజెపిలోకి హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తునిస్తున్నట్లు చెప్పారు. బిజెపి పార్టీ ఆన్ లైన్ నెంబర్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు సికె.బాబు.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అమిత్ షా నాయకత్వం, మోడీ అభివృద్ధికి ఆకర్షితుడైనట్లు చెప్పారు. తన చేరిక పట్ల రాష్ట్ర నాయకత్వం సంతృప్తి గా ఉందన్నారు. బిజెపి పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కార్యకర్తలా పనిచేస్తానని, పార్టీకి చేటు తెచ్చె ఏ పని చేయనన్నారు. అదే సందర్భంగా సికె బాబు శ్రీమతి లావణ్య మాట్లాడుతూ, బిజెపిలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మోదీ, అమిత్ షా లు దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు చెప్పారు. అందుకే బిజెపిలో చేరామని, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని చెప్పారు.