విచారణకు చంద్రబాబు సహకరించలేదు: సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద

 రెండు రోజుల పాటు  చంద్రబాబు సీఐడీ విచారణకు  సహకరించలేదని  వివేకానంద చెప్పారు.  
 

Google News Follow Us

అమరావతి: విచారణలో చంద్రబాబు సహకరించలేదని  సీఐడీ తరపు న్యాయవాది  వివేకానంద చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు పూర్తైంది.   ఆ తర్వాత చంద్రబాబును  వర్చువల్ గా  ఏసీబీ కోర్టు జడ్జి ముందు  చంద్రబాబును  సీఐడీ అధికారులు హాజరు పర్చారు. చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5వరకు కోర్టు పొడిగించింది. 

చంద్రబాబుకు రిమాండ్ పొడిగించిన తర్వాత  కోర్టు వెలుపల  సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు కస్టడీని  పొడిగించాలని  జడ్జిని కోరుతామన్నారు. రెండు రోజుల విచారణలో సీఐడీకి చంద్రబాబు సహకరించలేదన్నారు. అయితే ఈ విషయమై  పిటిషన్ ను కోర్టులో దాఖలు చేస్తామని  సీఐడీ తరపు న్యాయవాది చెప్పారు.

గతంలో సాక్షులను చంద్రబాబు ప్రభావితం చేసిన అంశాలను  కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా  వివేకానంద చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఫైబర్ గ్రిడ్  కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్లపై రేపు వచ్చే అవకాశం ఉందన్నారు.

also read:సీఐడీ అధికారులు ఇబ్బంది పెట్టారా?: చంద్రబాబును అడిగిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

ఈ నెల  23, 24 తేదీల్లో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును  ఏపీ సీఐడీ పోలీసులు విచారించారు.  రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ  ఏసీబీ కోర్టు  ఈ నెల  22న ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు  చంద్రబాబును సుమారు  12 గంటల పాటు  విచారించారు. 12 గంటల పాటు  130  ప్రశ్నలు సంధించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో   కొన్ని ఆధారాలను చూపి చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.