Andhra Pradesh Assenbly Elections 2024 : పొలిటికల్ వార్ ... చంద్రబాబు, పవన్, జగన్ మధ్య పేలిన మాటల తూటాలివే...

By Arun Kumar PFirst Published Apr 11, 2024, 1:17 PM IST
Highlights

ఎన్నికల వేళ రాాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ లు చేసిన కాంట్రవర్సీ, సెన్సేషన్ కామెంట్స్ ఏమిటో చూద్దాం...

అమరావతి : లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నారు. మండె ఎండలను సైతం మించిపోయేలా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే నాలుగో విడతలో అంటే మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అభ్యర్థుల ప్రకటనను పూర్తిచేసి ప్రచార రంగంలోకి దిగాయి ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రదాన పార్టీలు. అయితే ఈ ప్రచార పర్వంలో మాటల తూటాలు పేలుతున్నాయి... రాజకీయ ప్రముఖులు సైతం ఒకరిపై ఒకరు సీరియస్ ఆరోపణలు చేసుకుంటున్నారు. 

కేవలం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే కాదు వ్యూహాత్మకంగా తమకు కలిసివస్తుంది అనుకుంటే ప్రత్యర్థి పనులను కూడా ప్రశంసించాల్సి వస్తుంది. ఇలా తాజాగా ప్రస్తుత జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థపై టిడిపి చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. టిడిపి అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను కొనసాగిస్తామని... వారి జీతాలు కూడా పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. ఇలా గతంలో వాలంటీర్ల తీరును తప్పుబట్టి ఎన్నికల విధుల్లో వారిని ఉపయోగించకుండా అడ్డుకున్న చంద్రబాబు ఆశ్చర్యకరంగా వారి జీతాల పెంపు హామీ ఇచ్చారు. ఇలా అన్నిపార్టీలు పక్కా వ్యూహాలతో 2024 ఎన్నికలకు వెళుతున్నాయి.

అయితే తాజా హామీల నేపథ్యంలో వాలంటీర్లపై చంద్రబాబు గతంలో చేసిన విమర్శలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు నారా లోకేష్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ వంటి పొలిటికల్ స్టార్స్ చేసిన సంచలన, వివాదాస్పద కామెంట్స్ ను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. గతంలో ఏం మాట్లాడారు? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? అని పోల్చిచూస్తున్నారు.  

1. చంద్రబాబు నాయుడు : 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడికి సౌమ్యుడిగా పేరుంది. రాజకీయాల్లో చాలా సీనియర్ మాత్రమే కాదు వయసు రిత్యా కూడా పెద్దవారు... కాబట్టి చంద్రబాబు దుందుడుకుగా కాకుండా సంయమనం పాటిస్తూ రాజకీయా చేసేవారు. కానీ ఇటీవల జైలుకు వెళ్లివచ్చిన తర్వాత చంద్రబాబులో చాలా మార్పు వచ్చింది... తన స్వభావానికి భిన్నంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు, నాయకులపై పదునైన మాటలతో ఎదురుదాడి చేస్తూ తగ్గేదేలే అంటున్నారు.

వాలంటీర్లపై వరాలు : 

జగన్ సర్కార్ నియమించిన వాలంటీర్లు ఎవరో కాదు... వైసిపి నాయకులు, కార్యకర్తలేనని గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో వేలాదిమంది మహిళలు కనిపించకుండా పోవడానికి వాలంటీర్లే కారణమని పవన్ కల్యాణ్ ఆరోపిస్తే టిడిపి నేతలు కూడా వంతపాడారు. ఇటీవల వాలంటీర్లు ప్రభుత్వ పథకాల్లోనే కాదు ఎన్నికల విధుల్లో ఉపయోగించకూడదని డిమాండ్ చేసింది కూడా టిడిపియే. అలాంటిది చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలను రెట్టింపు చేస్తామని... వారిని కొనసాగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ : 

సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి వైసిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు షర్మిల. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది... షర్మిలను రెచ్చగొట్టి తమ కుటుంబంలో చిచ్చు పెట్టాడని స్వయంగా సీఎం జగన్ అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్, షర్మిల కలిసి ప్రతిపక్ష కూటమిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని... తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.  

జగన్ సింగిల్ గా కాదు శవాలతో కలిసి వస్తున్నాడు : 

ప్రతిపక్ష పార్టీలు టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నాయి... కానీ వైసిపి మాత్రం సింగిల్ గా బరిలోకి దిగుతోంది. ఇదే విషయాన్ని ప్రజలవద్ద ప్రస్తావిస్తూ సింహం సింగిల్ గా వస్తుందని వైసిపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇటీవల పించన్ కోసం చనిపోయిన వృద్దురాలి మృతిని ప్రస్తావించారు చంద్రబాబు. పాలన చేతగాక జగన్ సర్కారే ఆమెను చంపిందని... అది టిడిపిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సింగిల్ గా కాదు శవాలతో కలిసి జగన్ వస్తున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేసారు. 

ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ : 

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా   ట్యాపింగ్ జరుగుతోంది అనేలా మాట్లాడారు. వైసిపి పాలనలో ఒక్క ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు మరెన్నో తప్పుడు పనులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోనించారు. 

వైసిపి ఎమ్మెల్యేలను కౌరవులు : 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తన భార్య భువనేశ్వరి అవమానించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. వైసిపి సభ్యుల తీరును నిరసిస్తూ ఆయన అసెంబ్లీ నుండి బయటకు వచ్చి మళ్లీ టిడిపి గెలిచి అధికారంలోకి వచ్చాకే  అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసాడు. అప్పటివరకు కౌరవ సభలో అడుగుపెట్టనంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసారు. ఇలా వైసిపి నాయకులను కౌరవులతో పోల్చారు చంద్రబాబు. 

 కుర్చీ మడతపెట్టి : 

ఇటీవల కుర్చీని మడతపెడితే అన్న డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఇటీవల వచ్చిన గుంటూరు కారం సినిమాలోనూ ఈ డైలాగ్ తో ఓ పాటనే రూపొందించారు. ఇలా జనాల నోట్లో బాగా నానుతున్న డైలాగ్ తో వైసిపికి మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. సీఎం జగన్ చొక్కా మడతబెడితు... టిడిపి నాయకులు, కార్యకర్తలు కుర్చీ మడతపెడతారని చంద్రబాబు హెచ్చరించారు.  

2. నారా లోకేష్ : 

తన తండ్రి చంద్రబాబులా కాకుండా లోకేష్ ప్రత్యర్థులపై కాస్త సీరియస్ కామెంట్స్ చేస్తుంటారు. టిడిపి నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చేలా, జోష్ నింపేలా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే లోకేష్ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు.   
 
వాలంటీర్లపై : 

ప్రస్తుతం వాలంటీర్లపై టీడిపి టోన్ మారినా గతంలో తీవ్ర విమర్శలు చేసారు. వైసిపి కోసం పనిచేస్తున్న వాలంటీర్లను తాము అధికారంలోకి రాగానే తొలగిస్తాం అనేలా మాటలుండేవి.
 నారా లోకేష్ కూడా వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసేవారు... ఓ సందర్భంగా వారిని దండుపాళ్యం బ్యాచ్ అంటూ కామెంట్ చేసారు. 

రెడ్ బుక్ :  

నారా లోకేష్ 'రెడ్ బుక్' వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. వైసిపి కోసం పనిచేస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నవారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నానని లోకేష్ ప్రకటించారు. వైసిపి కోసం పనిచేసే పోలీస్, ప్రభుత్వ అధికారుల పేర్లను కూడా రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని... అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తానని లోకేష్ హెచ్చరించారు. అయితే ఆయన రెడ్ బుక్ పేరిట అధికారులను బెదిరిస్తున్నారంటూ వైసిపి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయి. 
 
డైమండ్ పాప : 

మంత్రి రోజా తనపై , టిడిపి నాయకులపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ 'డైమండ్ పాప' 'డైమండ్ రాణి''జబర్దస్త ఆంటీ' అని సంబోధించారు లోకేష్. మంత్రి పదవి దక్కాక అవినీతి, అక్రమాలను కూడా రోజా జబర్దస్త్ గా చేస్తోందని లోకేష్ ఎద్దేవా చేసారు.  

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధులు :

అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కాంమాంధుల్లా అఘాయిత్యాలకు తెగబడుతున్నారని లోకేష్ మండిపడ్డారు.  కాటికి కాలుచాపిన వయసులో కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. మంత్రి అంబటిని కాంబాబు, మాజీమంత్రి అవంతిని అరగంట పనోడు అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

 సైకో జగన్ : 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలు సందర్భాల్లో సైకోగా పేర్కొన్నారు లోకేష్. ఆయన పాలన, నిర్ణయాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థ అవుతుందన్నారు. పాలన సరిగ్గాలేక జనం అల్లాడిపోతుంటే జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలస్ లో పబ్జీ ఆడుకుంటాడని లోకేష్ మండిపడ్డారు. ప్రజా ధనాన్ని జగన్ జలగ  పీల్చేస్తోందని ఆరోపించారు. 

3. వైఎస్ జగన్మోహన్ రెడ్డి : 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. తనను ఆర్థిక నేరగాడు, సైకో అని విమర్శించేవారికి ఘాటు కౌంటర్స్ ఇస్తుంటారు. కేవలం మాటలతోనే కాదు చేతలతోనూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు... ఇందుకు చంద్రబాబు అరెస్టే నిదర్శనం. తాజాగా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

చంద్రబాబు ఓ చంద్రముఖి, పశుపతి : 

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో పాల్గొన్న సీఎం జగన్ టిడిపి అధినేత చంద్రబాబును సినిమా విలన్లతో పోల్చారు. అరుందతి సినిమాలో పశుపతి, చంద్రముఖితొ చంద్రబాబును పోల్చారు జగన్. ఆయన మళ్లీ గెలిస్తే చంద్రముఖిలా లకలక అంటూ రక్తం తాగేస్తాడని జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పశుపతి లాగే పసుపుపతి అని సెటైర్లు వేసారు. 

పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై : 

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా సీఎం జగన్ విమర్శలు చేస్తుంటారు. పవన్ ఇంట్లో ఇల్లాలు ప్రతి మూడునాలుగు ఏళ్లకోసారి మారుతుందని... ఒకరేమో లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్ అంటూ పవన్ పెళ్లిళ్లు, భార్యాలపై కామెంట్ చేసారు.  ఇక చంద్రబాబు దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని జగన్ ను విమర్శిస్తుంటారు. 

వెంట్రుక కూడా పీకలేరు : 

టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా వచ్చినా వైసిపిని ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు వైఎస్ జగన్. చంద్రబాబు, పవన్ మాత్రమే కాదు ఎంతమంది కలిసివచ్చినా తన వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. యుద్దానికి తాను సిద్దమేనని... ఒక్కడినే ఎంతమందితో అయినా యుద్దం చేస్తానని జగన్ అన్నారు. 

దిక్కుమాలిన హంతకుడు, ఓ 420 : 

చంద్రబాబు నాయుడిని శాడిస్ట్... ఆయన వెన్నుపోట్లు, మోసం, కుట్రలు చేయడంలో దిట్ట అని జగన్ విమర్శించారు. తన స్వార్థ రాజకీయాల కోసం వాలంటీర్ సేవలను అడ్డుకుని అవ్వాతాతల మరణాలను కారణం అయ్యాడని... ఈ దిక్కుమాలిన హంతకుడిని నమ్మొద్దని సూచించారు. ప్రజల్ని మోసం చేస్తున్న పెద్ద 420 చంద్రబాబు అని జగన్ ఆరోపించారు. 

 రాజకీయాల కోసం కుటుంబాల్లో చిచ్చు : 

చంద్రబాబు నాయుడు కుంటుంబాల మధ్య చిచ్చు పెడతారని వైఎస్ జగన్ ఆరోపించారు. తమ రాజకీయాలు, పొత్తుల కోసం కుటుంబాలను చీలుస్తారంటూ ఆరోపించారు. తన కుటుంబంలోనూ అలాగే చిచ్చు పెట్టారంటూ సోదరి షర్మిల వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు సీఎం జగన్. 

4. పవన్ కల్యాణ్ : 

జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ప్రత్యర్ధులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాలపైనా విమర్శలు చేస్తుంటారు. 

వాలంటీర్లపై : 

వైసిపి ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేసారు పవన్ కల్యాణ్. వాలంటీర్లు సేకరించే ప్రజల వ్యక్తిగత వివరాలు సంఘవిద్రోహ శక్తుల చేతులకు చేరుతోందని ఆరోపించారు. ఇది ఒంటరి, నిరుపేద మహిళల అదృశ్యానికి కారణం అవుతోందన్నారు. ఇలా రాష్ట్రంలో వేలాదిమంది మహిళలు మాయం అయ్యారని అన్నారు. ఇలా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  

జగన్ నా నాలుగో భార్య : 

ఇటీవల తన పెళ్లిళ్ల గురించి మాట్లాడిని ముఖ్యమంత్రి జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్. తన వ్యక్తిగత జీవితం గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. నాకు మూడు కాదు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని... నాలుగో భార్య వైఎస్ జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

స్కామ్‌ స్టార్‌, ల్యాండ్ గ్రాబ‌ర్‌, స్కామ్‌ అండ్ లిక్క‌ర్ ఎంప‌ర‌ర్ : 

ముఖ్యమంత్రి జగన్ తనను ప్యాకేజీ స్టార్ అంటూ చేసిన విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ఓ స్కామ్‌ స్టార్‌, ల్యాండ్ గ్రాబ‌ర్‌, స్కామ్‌ అండ్ లిక్క‌ర్ ఎంప‌ర‌ర్ అంటూ ఆరోపించారు. 

పవన్ సినిమా డైలాగులు..:

తన సినిమా డైలాగ్స్ తో కూడా పవన్ ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు. ఇటీవల ఆయన నటిస్తున్న సినిమాలోని డైలాగ్ ను పొలిటికల్ వేదికపై చెప్పాడు పవన్. 'గాజు పగిలేకొద్ది రాటుదేలుతుంది' 'ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం' అంటూ వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. 


 

click me!