నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో వరుస రివ్యూలు.. పనితీరును బట్టే టిక్కెట్లు : తేల్చిచెప్పేసిన చంద్రబాబు

By Siva KodatiFirst Published Sep 16, 2022, 9:10 PM IST
Highlights

ముందుస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. మూడు నెలల తరువాత పనితీరును విశ్లేషించి టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు నేతలకు తేల్చిచెప్పారు.

ముందుస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ఆయన గత కొన్నిరోజులుగా ముఖాముఖీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు పాణ్యం, బనగానపల్లి, ఏలూరు నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో రివ్యూలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గౌరు చరితారెడ్డి, బిసి జనార్థన్ రెడ్డి, బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఇప్పటి వరకు 46 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీలు ముగిశాయి. పార్టీ ఇంచార్జ్ పనితీరుపై భేటీలలో ప్రధాన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తమ వద్ద ఉన్న సమాచారం, నివేదికల అధారంగా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై స్థానికంగా ఇంచార్జ్ చేస్తున్న పోరాటంతో పాటు...పార్టీ కార్యక్రమాల నిర్వహణపరంగా ఉన్న ఫీడ్ బ్యాక్‌పై చర్చలు జరిపారు. మూడు నెలల తరువాత పనితీరును విశ్లేషించి టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు నేతలకు తేల్చిచెప్పారు.

ఇకపోతే.. వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరి, సీఎం ప్రసంగం తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. 

ALso Read:వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ టికెట్లు : చంద్రబాబు సంచలన ప్రకటన

కాగా.. ఇప్పటికే మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడు సార్లు ఓడితే టికెట్ ఇచ్చేది లేదని.. అలాగే  ఇకపై ఎవరికైనా రెండు సార్లే పదవులు దక్కుతాయి లోకేష్ తేల్చిచెప్పారు. వచ్చేసారి పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శిగా తానూ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏళ్ల తరబడి పదవుల్లో వుంటే కొత్త రక్తం ఎలా వస్తుందని లోకేష్ ప్రశ్నించారు. 30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ యాక్టీవ్‌గా లేరని.. పనిచేయని నేతలకు ఇన్‌ఛార్జ్ పదవులు వుండవని ఆయన హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు దండం పెడితే గెలిచే పరిస్థితి వుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే మంత్రులు పార్టీకి రిపోర్టు చేసే వ్యవస్థ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. 

click me!