త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తయారు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో చంద్రబాబునాయుడు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
ఒంగోలు: త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తయారు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో చంద్రబాబునాయుడు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ గట్టి పట్టున్న జిల్లాల్లో బలమైన నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కూడ గత ఎన్నికల్లో టీడీపీ ఆశించిన స్థాయిలో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోలేదు.
అయితే ఈ దఫా ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ప్రకాశం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు పనితీరు ఆధారంగా చంద్రబాబునాయుడు అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఒంగోలు సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్, అద్దంకిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్,, దర్శిలో శిద్దా రాఘవరావు,చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుకూరులో పోతుల రామరావు, కొండపిలో డోలా బాల వీరాంజనేయులు, గిద్దలూరులో ఎం. ఆశోక్రెడ్డికి బాబు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా కరణం వెంకటేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోకూడదని చంద్రబాబునాయుడు కరణం బలరాంకు సూచించారు. కరణం బలరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
జిల్లాలో చోటు చేసుకొన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కరణం కుటుంబానికి అద్దంకి టిక్కెట్టు ఇవ్వకుండా గొట్టిపాటికే టిక్కెట్టు ఇస్తే ఏం జరుగుతోందనే చర్చ కూడ లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కరణం బలరాంతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని ప్రచారం కూడ సాగుతోంది. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే నేతలు ఎలా స్పందిస్తారోననే విషయం తేలనుంది.