
దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులు సమావేశం అయ్యారు. వివరాలు.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సార్మక నాణేం విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే కార్యక్రమానికి హాజరైన జేపీ నడ్డాతో చంద్రబాబు సంభాషణ జరిపారు. అంతేకాకుండా.. జేపీ నడ్డాతో చంద్రబాబు, పురందేశ్వరిలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ నేత సీఎం రమేష్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కూడా పాల్గొన్నారు. అయితే గత కొంతకాలంగా ఏపీలో టీడీపీ, బీజేపీల పొత్తుపై రకరకాల ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా.. జేపీ నడ్డాతో చంద్రబాబు, పురందేశ్వరిల సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ సందర్భంగా ఏపీ రాజకీయ పరిణామాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీల పొత్తు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.