నిజమా: నారా లోకేష్ కోసం చంద్రబాబు త్యాగం

First Published Jun 28, 2018, 1:03 PM IST
Highlights

తన తనయుడు, మంత్రి నారా లోకేష్ కోసం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సీటును త్యాగం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

చిత్తూరు: తన తనయుడు, మంత్రి నారా లోకేష్ కోసం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సీటును త్యాగం చేసే అవకాశం ఉందని అంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటును నారా లోకేష్ కు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది.

కుప్పం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఆ సీటు నుంచి చంద్రబాబు నాయుడు ఆరుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. పైగా, ముఖ్యమంత్రి కేటాయించిన సీటు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. 

నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారని, అక్కడ విజయం ఖాయం కాబట్టి ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెసుసుబాటు లభిస్తుందని తెలుగుదేశం వర్గాలంటున్నాయి. 

గత కొంత కాలంగా నారా లోకేష్ కుప్పం నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. చంద్రబాబుకు మాదిరిగానే లోకేష్ కు అక్కడ అందరూ తెలుసు. తొలిసారి శాసనసభకు పోటీ చేసే లోకేష్ కు విజయం అనివార్యం. అందువల్ల ఆయన సురక్షితమైన కుప్పం సీటు నుంచి పోటీ చేసి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తారని అంటున్నారు. 

చంద్రబాబు కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో కూడా టీడీపీ బలంగా ఉంది. చంద్రబాబు కోసం తెలుగుదేశం శాసనసభ్యులు తమ సీటును త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

click me!