చెప్పా పెట్టకుండా తనను టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం పట్ల గౌతు శిరీష ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడి సూచన మేరకు చంద్రబాబు శిరీషను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గౌతు శయామ సుందర శివాజీ కూతురు శిరీషకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అద్యక్ష పదవి నుంచి ఆమెను తొలగించారు. కూన రవికుమార్ ను పార్లమెంటు నియోయజకవర్గం అధ్యక్షుడి పేరుతో నియమించారు.
టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడిగా నియమితుడు కానున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడి రాజకీయంలో భాగంగానే అది జరిగిందని అనుకుంటున్నారు. తాను రాష్ట్రాధ్యక్షుడిని కాబోతున్నట్లు తెలుసుకున్న అచ్చెన్న గౌతు శ్యామ సుందర శివాజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఆశీస్సులు తీసుకున్న వారం రోజుల లోపే శిరీషను పదవి నుంచి తప్పించారు.
అచ్చెన్నాయుడికి తెలియకుండా శిరీషను చంద్రబాబు పక్కన పెట్టే అవకాశం లేదని అంటున్నారు. అచ్చెన్నాయుడి సూచనల మేరకు ఆమెను జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారనే మాట వినిపిస్తోంది.
తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం పట్ల శిరీష్ ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఓ మాటైనా చెప్పి తనను తప్పించి ఉంటే బాగుండేదని ఆమె అనుకుంటున్నారని సమాచారం.