
పోలవరం ప్రాజెక్టుపై దుష్టుల కళ్ళు పడకూడదని చంద్రబాబునాయుడు సంకల్పం చెప్పుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నదుష్టశక్తుల అడ్డు తొలగాలని కూడా సంకల్పం చెప్పుకున్నారు దుర్గ గుడిలో చంద్రబాబు. ఇంతకీ ఈ సంకల్పాలేమిటి అనుకుంటున్నారా? మీరే చదవండి...పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేయాలని, దుష్టుల కళ్ళు పడకుండా ఉండాలని అమ్మవారిని చంద్రబాబు కోరుకున్నారట.
ఇంతకీ దుష్టులంటే ఎవరు? ప్రతిపక్ష వైసీపీ నేతలా లేక పనులు చేయకుండా జాప్యం చేస్తూ డబ్బులు మాత్రం వెనకేసుకుంటున్న వాళ్ళా? పోలవరం నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళారట. అక్కడ కొందరు డబ్బులు రాకుండా చేయాలని చూసారట. మరి ‘‘ఆ కొందరు ఎవరో’’ మాత్రం చెప్పలేదు. ఆ ముక్క కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా? పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ. 42 వేల కోట్లు అవసరమట.
చంద్రబాబు బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దసరా సందర్భంగా దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు లేండి. ఆ సందర్భంగా బోలెడు సంకల్పాలు చేసుకున్నారట. నిజమేనా అని అడకూడదు. ఎందుకంటే, ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే.
మొదటగా స్వచ్చతే సేవ అనే సంకల్పం చేసారట. భవిష్యత్తులో స్మార్ట్ వాటర్ గ్రిడ్ రావాలని కూడా సంకల్పం చేసారట. కొత్త టెక్నాలజీతో భవిష్యత్తులో కరెంటు చార్జీలు తగ్గే అవకాశం ఉందట. కాబట్టి టెక్నాలజీని ఆశీర్వదించమని కోరారట. కాస్త విచిత్రంగా ఉన్నా ‘‘అభివృద్ధికి అడ్డుపడుతున్న దుష్టశక్తుల అడ్డుతొలగాల’’ని కూడా కోరుకున్నారట.
పైగా తన సంకల్పాలన్నింటినీ నెరవేరిస్తే భవిష్యత్ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తానని కూడా మరో సంకల్పం చెప్పుకున్నారట. ‘మీడియా వాళ్ళు చూసింది రాస్తే మీకు కూడా అమ్మవారి కృపుంటుంది’ అని చంద్రబాబు చెప్పటం కొసమెరుపు.