
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ ఎండీని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేడు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు మాట్లాడిన మనీష్ సిసోడియా.. తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు.. గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నెల్లూరులోని మాగుంట కార్యాలయం, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఖండించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో డైరెక్టర్లుగా లేమని చెప్పారు. వ్యాపారం చేసే తమ బంధువులకు మాగుంట అనే పేరు ఉండటం వల్లే తమపై ఆరోపణలు అని చెప్పారు. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే తమ బంధువులు 2 జోన్లలో వ్యాపారం చేశారని తెలిపారు. తమ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసిన ఈడీకి అనుమానాలు నివృత్తి చేసినట్టుగా చెప్పారు.
ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో వచ్చినట్టుగా స్పష్టం చేశారు. తాను ఏ వ్యాపారాల్లోనూ భాగస్వామిని కాదని చెప్పారు. తన వ్యక్తిత్వంపై కావాలని దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై సీబీఐ కూడా విచారణ జరుపుతోందన్నారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తున్నాయని అన్నారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీలో మీడియాలో రకరకాల పేర్లు పెట్టారని అన్నారు. తమ బంధువులు చేసే వ్యాపారాలు తమకు నష్టం కలిగించాయని చెప్పారు. అయినప్పటికీ తమ రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 2024లో ఒంగోలు ఎంపీగా తన కొడుకు రాఘవరెడ్డి పోటీ చేస్తారని చెప్పారు.