మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పదో రోజున సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప జైలులో ఉన్న ముగ్గురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పదో రోజున సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప జైలులో ఉన్న ముగ్గురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 2019 మార్చి మాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వివేకానందరెడ్డి హత్యకు గురై రెండేళ్లు దాటినా ఇంకా హంతకులను గుర్తించలేదు. ఈ విషయమై వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై గత మాసంలో ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
also read:వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ: వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్లను ప్రశ్నిస్తున్న అధికారులు
10 రోజులుగా కడప కేంద్రంగా చేసుకొని సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. బుధవారం నాడు చిట్వేలికి చెందిన లక్ష్మీరంగ, రమణ, సుంకేసులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.జగదీశ్వర్ రెడ్డి గతంలో వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేశారు.
2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం సంచలనంగా మారింది. ఈ హత్య కేసుపై చంద్రబాబు సర్కార్, జగన్ సర్కార్ సిట్ లను ఏర్పాటు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశం మేరకు ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వైఎస్ వివేకా కూతురు సునీత కూడ హైకోర్టును కోరిన విషయం తెలిసిందే.