చంద్రబాబుకు రక్తాభిషేకం... టికెట్ కోసం ఏకంగా రక్తాన్నే చిందించిన బుద్దా వెంకన్న

By Arun Kumar PFirst Published Feb 18, 2024, 1:43 PM IST
Highlights

చంద్రబాబుపై అభిమానమో లేక టిడిపి సీటు కోసం ప్రయత్నమో... బుద్దా వెంకన్న తన రక్తంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు.  

విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి కోసం రక్తం చిందించాడు బుద్దా వెంకన్న. పార్టీ నాయకులు, కార్యకర్తలందరి ముందే తన రక్తాన్ని తీయించుకున్న వెంకన్న దాంతో చంద్రబాబు ప్లెక్సీకి అభిషేకం చేసారు. అంతేకాకుండా అదే రక్తంతో''సిబిఎన్ జిందాబాద్... నా ప్రాణం మీరే'అంటూ  గోడపై రాసారు. ఇలా చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకుంటూనే   పార్టీ కోసం పనిచేసే తనలాంటి వారికి టికెట్లు ఇవ్వాలని అధ్యక్షున్ని కోరారు. అసలు వాస్తవాలు  చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 

వీడియో

గతంలో పార్టీ అధినేత చంద్రబాబుపై దాడికి యత్నిస్తూ టిడిపి నాయకులెవరూ మాట్లాడలేదు... కానీ తాను పోరాటం చేసానని వెంకన్న తెలిపారు.  చంద్రబాబు ఇంటిపైకి గొడవకు వచ్చిన జోగి రమేష్ తో తాడోపేడో తేల్చుకోడానికి సిద్దమయ్యానని అన్నారు. ఎండలో పోరాటం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది అందరూ చూసారన్నారు. ఇక మాచర్లలో వైసిపి నాయకుడు తురకా కిషోర్ చేసిన దాడిని కూడా బుద్దా వెంకన్న గుర్తుచేసారు. ఇలా పార్టీకోసం, చంద్రబాబు కోసం తన ప్రాణాలకు తెగించి పోరాడానని బుద్దా వెంకన్న గుర్తుచేసారు. 

Also Read  ఆంబోతుల మాదిరిగా పడ్డారు.. నేనూ, పవన్ కళ్యాణ్‌ వైసీపీ బాధితులమే : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

అయితే తన దరిద్రానికి కేశినేని నాని లాంటి వెధవ విజయవాడలో వున్నాడని... వాడు తనను టార్గెట్ చేసాడని బుద్దా వెంకన్న అన్నారు. తనను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతల నుండి తొలగించాలని... వేరేవాళ్ళకు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించాడు. అతడి పోరు పడలేక చంద్రబాబు తనను విజయవాడ అర్భన్ బాధ్యతలు అప్పగించారని... ఆరేళ్లు అక్కడ పార్టీని సక్సెస్ ఫుల్ గా నడిపించానని తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ బాధ్యతలు అప్పగిస్తే అక్కడా సమర్ధవంతంగా పనిచేసానని అన్నారు.  

ఇలా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సంసిద్దం అయినట్లు వెంకన్న తెలిపారు. ఈసారి తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని... అవకాశం కల్పించాలని చంద్రబాబు, లోకేష్ లను కోరానని అన్నారు. ఇక్కడ కుదరకుంటే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దింపాలని అధినేతను కోరారు వెంకన్న.  

తన రక్తంతో కాళ్ళు కడిగేంత ప్రేమ చంద్రబాబుపై వుందని బుద్దా తెలిపారు. తాను కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నాని లాంటి వాడిని కాదు... చంద్రబాబు అడిగితే గుండె తీసి టెబుల్ పై పెడతాను... శరీరంలో ప్రవహించే రక్తం మొత్తం చంద్రబాబుదే అని వెంకన్న అన్నారు. టిడిపి కోసం, అధినేత చంద్రబాబు కోసం ఏమైనా చేస్తాను.. ఎవరితో అయినా పోరాడతానన్నారు.ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా ఆయనవెంటే వుంటాన్నారు. అభిమానంతోనే టికెట్ కావాలని కోరుతున్నా... బ్లాక్ మెయిల్ చేయడంలేదని బుద్దా వెంకన్న అన్నారు. 
 

click me!