మా మందు వాడితే రెండు రోజుల్లో రోగికి నెగెటివ్: బొనిగె ఆనందయ్య

By telugu teamFirst Published May 21, 2021, 2:27 PM IST
Highlights

కరోనా పాజిటివ్ ఉన్నవారికి మాత్రమే తమ ఆయుర్వేద మందును ఇస్తున్నట్లు బొనిగె ఆనందయ్య చెప్పారు పరీక్షలు చేయించి, పాజిటివ్ ఉన్నట్లు తేలితేనే మందు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

నెల్లూరు:ప్రస్తుతం కరోనా పాజిటివ్ ఉన్నవారికి మాత్రమే తమ ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు బొనిగె ఆనందయ్య చెప్పారు. కరోనా పాజిటివ్ లేనివారికి ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. పరీక్షలు చేయించి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలితేనే మందు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బొనిగె ఆనందయ్య మందుతో కరోనా వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు చాలా మంది చెబుతున్నారు. 

తాము మూడు రకాల మందులు ఇస్తున్నట్లు ఆనందయ్య చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చినవారికి ఇస్తున్నామని, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి మందు ఇస్తున్నామని ఆనందయ్య చెప్పారు. తమ మందు పనిచేస్తుందని రుజువు చేయగలనని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో, అంటే 48 గంటల్లో కరోనా రోగులకు నెగెటివ్ వస్తుందని ఆయన చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్వం నుంచి ఈ మందులున్నాయని ఆయన చెప్పారు. జ్వరానికి, జలుబుకు కూడా మందు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు తమ కరోనా మందులపై భరోసా ఉందని ఆయన చెప్పారు. 

ఆనందయ్య కరోనా మందుపై విశేషమైన ప్రాచుర్యం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం గ్రామానికి వేలాదిగా కరోనా రోగులు చేరుకుంటున్నారు. దాదాపు 50 వేల మంది అక్కడికి చేరుకుని ఉంటారని అంచనా. అంబులెన్స్ లో కూడా రోగులు వస్తున్నారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. 

ఇదిలావుంటే,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్య కరోనా ఆయుర్వేదం మందు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేశారు. ఆ మందు శాస్త్రియతను నిర్ధారించాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐసిఎంఆర్ బృందం నెల్లూరుకు చేరుకుంటోంది.

కేంద్ర విభాగాల అధికారులతో దానిపై అధ్యయనం చేయించాలని ఆయన సూచించారు. దీంతో ఐసిఎంఆర్ మందుపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేస్తోంది. కరోనా మందు కోసం కృష్ణపట్నానికి వేలాది మంది చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. దాంతో కొద్ది సేపు ఆనందయ్య మందు ఇవ్వడాన్ని ఆపేశారరు. 

కాగా, కరోనా వైరస్ కు నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేదం మందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ మందుపై అంతటా చర్చ సాగుతోంది. వేలాది మందిగా ప్రజలు ఆయన మందు కోసం బారులు తీరుతున్నారు. తాను ఇస్తున్న మందుకు ఆయన డబ్బులేమీ వసూలు చేయడం లేదు. 

click me!