ఆ క్రెడిట్ బీజేపీదే, మీతో వేదిక పంచుకోం : పవన్ కల్యాణ్ కు కన్నా హ్యాండ్

By Nagaraju penumalaFirst Published Oct 30, 2019, 7:45 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ కు తాము బయట నుంచి మద్దతు తెలుపుతామే తప్ప వేదిక పంచుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. ఇకపోతే రాష్ట్రంలో ఇసుక కొరతపై పోరాటం మెుదలు పెట్టింది బీజేపీయేనని చెప్పుకొచ్చారు. 
 

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చింది ఏపీ బీజేపీ. ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ నవంబర్ 3న విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ లో తాము పాల్గొనబోమని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. 

పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ కు తాము బయట నుంచి మద్దతు తెలుపుతామే తప్ప వేదిక పంచుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ. ఇకపోతే రాష్ట్రంలో ఇసుక కొరతపై పోరాటం మెుదలు పెట్టింది బీజేపీయేనని చెప్పుకొచ్చారు. 

ఇసుక కొరతను నిరసిస్తూ ఏపీ బీజేపీ నిరసనలకు దిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు సైతం రాసిందని గుర్తు చేశారు. అలాగే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకొరతపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ భిక్షాటన చేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుకు తెచ్చారు. అంతా ఇసుకపై పోరాటం ఇప్పుడు చేస్తుంటే ఆ పోరాటం మెుదలుపెట్టిందే బీజేపీ అని కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. 

విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే లాంగ్ మార్చ్ కు పవన్ కళ్యాణ్ విపక్షాల మద్దతు కోరారు. అందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి ఆహ్వానించారు. తమతోపాటు లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని ఆహ్వానించారు. అయితే అందుకు కన్నా ససేమిరా అనేశారు. 

రాష్ట్రంలో ఇసుక దొరకక ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రకటించింది. అందులో 
భాగంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిరసనకు పిలుపునిచ్చింది. నవంబర్ 3న భారీగా లాంగ్ మార్చ్ చేపట్టాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించి ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టబోయే లాంగ్ మార్చ్ కు మద్దతు పలకాల్సిందిగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను పవన్ కళ్యాణ్ కోరారు. 

బుధవారం మధ్యాహ్నం కన్నా లక్ష్మీనారాయణకు స్వయంగా పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. లాంగ్ మార్చ్ తలపెట్టడానికి గల కారణాలను వివరించారు. ఆగస్టు 4వ తేదీన భీమవరం సమావేశంలో పాల్గొనడానికి రాజమండ్రి నుండి బయలుదేరిన పవన్ వాహనాన్ని ఆపి సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు తమ 
కష్టాలను తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇసుక దొరకక తమ ఉపాధి పోయిందని వివరించారు. 

అలాగే మంగళగిరికి వెళ్ళినప్పుడు కూడా కొందరు భవన 
నిర్మాణ కార్మికులు ఇలాగే తమ బాధలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

అయితే కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పడంతో సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో కొద్దిగా  వేచి చూశానని...అయితే రాను రాను 
సమస్య మరింత తీవ్రతరం అవుతుండటంతో పోరాటానికి సిద్దమైనట్లు పవన్ వెల్లడించారు. 

ఇసుక అందరాని సరుకుగా మారిపోయి చివరకు ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ఈ సమస్య పరిష్కారం కోసం విశాఖలో లాంగ్ మార్చ్ కు పిలుపు నిచ్చారు.  

అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం, ప్రధాని  మోడీ 
గారి దృష్టికి కూడా పవన్ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 

అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాలని మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ను కొందరు భవన నిర్మాణ కార్మికులు కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి మీరు చొరవ చూపాలని కోరారు. 

అలాగే తెలంగాణాలో జరుగుతున్న ఆర్.టి.సి సమ్మెలో అక్కడి రాజకీయ పార్టీలు చూపుతున్న సంఘీభావాన్ని, ఐక్యతను ఇసుక సమస్య పరిష్కారంలో కుడా చూపాలని 
వారు విన్నవించారు.  

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి మద్దతు కోరారు. తొలుత సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ పార్టీలో చర్చించిన అనంతరం ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ హ్యాండ్ ఇవ్వడంతో మిగిలిన పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయోనన్నది చర్చనీయాంశంగా మారింది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇసుక కొరత: లాంగ్ మార్చ్ కు కన్నాను ఆహ్వానించిన పవన్ కల్యాణ్
 

click me!