మోడీ పర్యటనతో ఏపీ ప్రజల్లో మార్పు.. బీజేపీ- జనసేనలదే భవిష్యత్తు : జీవీఎల్ నరసింహారావు

By Siva KodatiFirst Published Nov 18, 2022, 4:01 PM IST
Highlights

వైసీపీ, టీడీపీలపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. మోడీ విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. బిజెపి, జనసేన భాగస్వామ్యంతో అధికారంలోకి వస్తామని జీవీఎల్ జోస్యం చెప్పారు. 

రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి ‌జరుగుతుందని ఆధారాలతో‌ చెబుతూ ఉన్నామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపోరు సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రజలకు వివరించామన్నారు. వైసిపి వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ కార్యాచరణ సిద్దం చేశామని.. ఎక్కడిక్కడ పోరాటాలు చేసి ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని జీవీఎల్ హెచ్చరించారు. రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని... గన్నవరం విమానాశ్రయంలో స్థానిక పోలీసులతో రక్షణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

టిడిపి, వైసిపి ప్రభుత్వం హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయని.. కేంద్ర విమానయానశాఖ మంత్రికి లేఖ రాశానని జీవీఎల్ తెలిపారు. సీఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు వేల నోట్లు ఎందుకు కనిపించకుండా పోయాయని జీవీఎల్ ప్రశ్నించారు. ఆర్.బి.ఐ ద్వారా విచారణ చేయాలని కోరతామని... జగన్ ప్రభుత్వం వైఫల్యంపై ఛార్జిషీట్ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. టిడిపికి సొంత ప్రయోనాలే తప్ప .. ప్రజల‌ ప్రయోజనాలు పట్టవన్నారు. మోడీ విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తోందని జీవీఎల్ పేర్కొన్నారు. మా మిత్ర పక్షం.. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే చెప్పారని ఆయన గుర్తుచేశారు. 

2024లో ఎపిలో మోడీ మ్యాజిక్ పని చేస్తుందని.. బిజెపి, జనసేన భాగస్వామ్యంతో అధికారంలోకి వస్తామని జీవీఎల్ పేర్కొన్నారు. పొలిటికల్ బ్లాక్ బస్టర్ 2024లో రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టిడిపి పూర్తి అభద్రతా భావంతో ఉందని.. వారిలో నాయకత్వం క్షీణిస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారని జీవీఎల్ చెప్పారు. వైసిపి, టిడిపిలు రెండూ కుటుంబ పార్టీలు,కుట్ర పార్టీలని ఆయన ఎద్దేవా చేశారు. నిజమైన ప్రత్యామ్నాయం ఒక్క బిజెపితోనే సాధ్యమని.. రాష్ట్రంలో కాపులకు, బిసిలకు, ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరగడం లేదని జీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read:బీజేపీపై తప్పుడు ప్రచారం.. సోము వీర్రాజును మోడీ ఏం అడిగారంటే : జీవీఎల్ క్లారిటీ

అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం బిజెపి, జనసేన కూటమికే సాధ్యమన్న ఆయన.. వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ సిద్దంగా వుందన్నారు. యనమల వంటి వారికే సీటు లేదని చంద్రబాబు అంటున్నారని.. వైసిపిలో కేవలం ఒక వర్గానికే పదవులు దక్కుతున్నాయని నరసింహారావు ఎద్దేవా చేశారు. వైసిపి కాదు... బిజెపి, జనసేన తోనే రాష్ట్రానికి భవిష్యత్తు వుంటుందన్నారు. అన్నమయ్య బ్యారేజి కొట్టుకుపోయి యేడాది అయినా జగన్‌లో స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వాళ్లు ముందుగా వెళ్లి సహాయక చర్యలు చేపట్టారని... కానీ రాజకీయ పర్యటనగానే జగన్ వెళ్లి వచ్చారని జీవీఎల్ దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది.. ఏ సాయం అందించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

click me!