బాబు వస్తుంటే.. సాయిరెడ్డిని ఎలా రానిచ్చారు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

By Siva KodatiFirst Published Jan 6, 2021, 2:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలన్నీ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. రామతీర్ధం సహా పలు దేవాలయాలపై దాడుల నేపథ్యంలో దేవాలయ భూములను పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలన్నీ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. రామతీర్ధం సహా పలు దేవాలయాలపై దాడుల నేపథ్యంలో దేవాలయ భూములను పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తాజాగా దేవాలయల భూములను హౌసింగ్‌కు ఇవ్వడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ... అనువంశిక వ్యవస్ధను వైసీపీ ప్రభత్వం పక్కన పెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.

వైసీపీ నాయకులు ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకున్నారని మాధవ్ మండిపడ్డారు. తిరుమల బస్ టికెట్లపై జెరూసలెం యాత్ర గురించి ప్రచారం చేయడాన్ని తాము ప్రశ్నించామని, శ్రీశైలంలో దుకాణాలను అన్యమతస్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించామని మాధవ్ చెప్పారు.

Also Read:రామతీర్థం : రంపంతో తలకోసి, పక్కా ప్లాన్‌తోనే విగ్రహ ధ్వంసం..! దిమ్మతిరిగే నిజాలు చెప్పిన డీజీ

పోలీసులు సైతం వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. గతంలో ఎప్పుడూలేని విధంగా పోలీస్ స్టేషన్లలో సెమీ క్రిస్టమస్ వేడుకలు చేయడంలో ఆంతర్యమేంటని మాధవ్ నిలదీశారు.

దేవాలయాలపై దాడులను రాజకీయం చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రామతీర్థం ఎలా రానిచ్చారని మాధవ్ ప్రశ్నించారు.

వైసీపీ నేతలకు వీఐపీ ట్రీట్ మెంట్‌తో కొండపైకి ఎందుకు తీసుకువెళ్లారని ఆయన నిలదీశారు. రామతీర్థం సందర్శనకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుని, అక్రమ నిర్భంధాలకు పాల్పడతారా అని మాధవ్ ప్రశ్నించారు. దుండగులను అరెస్ట్ చేసేంతవరకూ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 
 

click me!