రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు.. ‘రాజధానిగా అమరావతికే మద్దతు’

By telugu teamFirst Published Nov 21, 2021, 6:16 PM IST
Highlights

అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరులో వారు రైతు పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్ర దేవస్థానం చేరేలోపే జగన్‌తో అమరావతి రాజధానిపై ప్రకటన చేయిస్తామని వివరించారు. రైతులపై పోలీసుల దాడిని ఖండించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 

నెల్లూరు: Amaravati రాజధాని రైతుల పాదయాత్ర(Padayatra)కు BJP సంఘీభావం తెలిపింది. అమరావతికి బీజేపీ ప్రత్యేక మద్దతు ఇస్తున్నదని ఆ పార్టీ నేతలు తెలిపారు. Nelloreలో రైతుల పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శి సోమూ వీర్రాజు, బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, కన్నా, కామినేని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. రైతులకు అండగా నిలుస్తామని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అమరావతి చుట్టూ అభివృద్ధి పనులను కేంద్రంలోని బీజేపీనే చేపడుతున్నదని వివరించారు. రైతులపై పోలీసు దాడులను తప్పుపట్టారు. తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారని, ఆయన సూచనలతోనే రైతులకు Support ఇచ్చామని వివరించారు.

రైతు పాదయాత్రలో పాల్గొని బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతి ప్రజా రాజధాని అని, అమరావతిలోనే తాము పార్టీ కార్యాలయం పెడతామని గతంలోనే చెప్పామని సోమూ వీర్రాజు అన్నారు. రాయలసీమలో రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొంటారని, రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నదని ఆరోపించారు. రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పి సీఎం అయిన జగన్ ఇప్పుడు మాట తప్పుతున్నాడని విమర్శించారు. అమరావతిలో రైతులకు ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, పురంధేశ్వరి మాట్లాడుతూ, జై జవాన్, జై కిసాన్ అనేదే బీజేపీ విశ్వాసమని, అమరావతిలోనే రాజధాని కొనసాగాలని రెండేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రైతులపై లాఠీ చార్జ్ జరగడం దుర్మార్గమని, రైతు సోదరులకు బీజేపీ రక్షణగా నిలుస్తుందని భరోసానిచ్చారు. అమరావతికి, రైతులకు కేంద్రం న్యాయం చేస్తుందని వివరించారు.

Also Read: అమరావతి రైతుల పాదయాత్ర: నెల్లూరులో పాదయాత్రలో పాల్గొననున్న బీజేపీ నేతలు

రైతు కళ్లల్లో ఈ రోజు ఆనందం కనిపిస్తున్నదని, రాజధాని కచ్చితంగా అమరావతేనని, ముఖ్యమంత్రులు మారొచ్చు కానీ, అమరావతి రాజధాని మారదని సీఎం రమేష్ అన్నారు. పోలీసులు బెదిరించినా, ఇబ్బంది పెట్టినా తమకు చెప్పాలని తెలిపరాు. పోలీసుల ఆటలు ఇక సాగబోవు అని, రెండున్నరేళ్లు ఆడారని, ఇక చాలని ఎద్దేవా చేశారు. పోలీసుల పనితీరు మార్చుకోవాలని, ప్రభుత్వం ఇలా తయారవ్వడానికి పోలీసు వ్యవస్థే కారణమని ఆరోపణలు చేశారు. అమరావతి రాజధాని 29 గ్రామాలకు చెందినది కాదని, మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన విషయమని సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావొచ్చు.. పోవచ్చు అని చెప్పారు. ఒక్క సారి ఓటెయ్యండి అని వేడుకున్న జగన్ అసలు స్వరూపం బయటపడిందని, కక్ష్య సాధింపుతోనే ఆయన పాలన చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పరిరక్షణలాగే, ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ రావాలి అని అన్నారు. న్యాయ స్థానం నుంచి న్యాయం కనిపిస్తున్నదని, దీన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. లక్ష కోట్ల సంస్థలకు కేంద్ర ఆమోదం ఇచ్చిందని, వేలవేల కోట్లు అమరావతిలో
వేయడం జరిగిందని అన్నారు. రైతులకు ఒక్క రూపాయి నష్టం జరగదని, దేవస్థానానికి వెళ్లే లోపే జగన్ మెడలు వంచైనా రాజధానిపై ప్రకటన చేయిస్తామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రైతులు 45 రోజుల పాదయాత్ర చేపడుతున్నారు. రైతుల ప్రణాళిక ప్రకారం, వచ్చే నెల 15వ తేదీ కల్లా తిరుమలకు చేరుకోవాలి. తాజాగా, ఈ రైతుల పాదయాత్ర నెల్లూరులోకి ఎంటర్ అయింది. ఇక్కడే బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొని మద్దతు పలికింది.

click me!