రెండోసారి సీబీఐ నోటీసులా.. అరెస్ట్ చేస్తారేమో : అవినాష్ రెడ్డిపై ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 18, 2023, 08:33 PM ISTUpdated : Feb 18, 2023, 08:34 PM IST
రెండోసారి సీబీఐ నోటీసులా.. అరెస్ట్ చేస్తారేమో : అవినాష్ రెడ్డిపై ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. సీబీఐ రెండోసారి ఎవరినైనా విచారణకు రమ్మందంటే విషయం కొంచెం సీరియస్‌గా వున్నట్లేనని  ఆయన వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసే ఛాన్స్ వుందంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంపై స్పందించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ రెండోసారి ఎవరినైనా విచారణకు రమ్మందంటే విషయం కొంచెం సీరియస్‌గా వున్నట్లేనని అభిప్రాయపడ్డారు. వివేకా హత్య కేసు విచారణ ఓ క్రమం ప్రకారం జరుగుతోందని.. 24న అవినాష్ రెడ్డి ఖచ్చితంగా సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని ఆదినారాయణ రెడ్డి అన్నారు. లేనిపక్షంలో దీనిని సీబీఐ అధికారులు సీరియస్‌గా తీసుకునే అవకాశం వుందని.. విచారణ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్ వుందంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారు. ఇక ఈ కేసుకు సంబంధించి గత నెల 28న అవినాష్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. 

ALso REad: వైఎస్ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, 24న విచారణకు రావాలని ఆదేశం

దాదాపు 4 గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని అన్నారు. కొంతమంది దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో సీబీఐకి సహకరిస్తానని ఆయన తెలిపారు. తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులతో పంచుకున్నానని.. అయితే విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని కోరగా అందుకు వారు అంగీకరించలేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు. 

ఇక, విచారణకు హాజరయ్యే ముందు.. సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

ఇదిలావుండగా.. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఫిబ్రవరి 16న తెలంగాణ హైకోర్టులో వివేకా సతీమణి సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేశారు. 2019, మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్యకు గురయ్యారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. పులివెందుల పీఎస్‌లో కేసు నమోదు చేశారని..దీనిని సీబీఐకి బదిలీ చేయాలని తాము హైకోర్టులో పిటిషన్ వేసినట్లు సౌభాగ్యమ్మ తెలిపారు. 2020 మార్చి 11న కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించిందని ఆమె వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి నేర అభియోగ పత్రాలు దాఖలు చేసిందని.. సీబీఐ అధికారులు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారని వివేకా భార్య పేర్కొన్నారు. 

ALso Read: వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ రికార్డింగ్ లో సంచలనం ఏమీ లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

అందులో ఏ2గా సునీల్ యాదవ్ వున్నారని.. సునీల్ యాదవ్ సహ నిందితులు దర్యాప్తు, విచారణను ప్రభావితం చేశారని ఆమె పిటిషన్‌లో ప్రస్తావించారు. కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారని సౌభాగ్యమ్మ వెల్లడించారు . 2022 నవంబర్ 29న విచారణను నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పు వచ్చిందన్నారు. సీబీఐ కోర్ట్ గత నెల విచారణకు స్వీకరించిందని.. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశాడని.. బెయిల్ ఇవ్వొద్దని ఇంప్లీడ్ పిటిషన్ వేసే హక్కు బాధితులకు వుంటుందని సౌభాగ్యమ్మ వెల్లడించారు. వైఎస్ వివేకా హత్య తర్వాత నిందితుల వల్ల.. తాను , తన కుమార్తె ఎంతో మానసిక క్షోభ అనుభవించామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu