ఏపీలో విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు.. ప్రత్యేక యాప్‌ రూపొందించిన పాఠశాల విద్యా శాఖ.. తొలుత అక్కడే..

By team teluguFirst Published Oct 31, 2021, 1:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నుంచి అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని విద్యార్థులతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆదేశించిన సంగతి తెలిసిందే.  అమ్మ ఒడి పథకం కోసం విద్యార్థులకు హాజరు 75 శాతం ఉండాలనే నిబంధనను వర్తింప చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నుంచి అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని విద్యార్థులతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆదేశించిన సంగతి తెలిసిందే.  అమ్మ ఒడి పథకం కోసం విద్యార్థులకు హాజరు 75 శాతం ఉండాలనే నిబంధనను వర్తింప చేయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాజరు నమోదుకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.  బయోమెట్రిక్‌ ద్వారా ఈ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేయనున్నారు. ప్రయోగత్మాకంగా కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ ఆధారంగా హాజరు నమోదుకు ఆప్లికేషన్‌ను అభివృద్ది చేశారు. ఇందులో ఏవైనా లోపాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనుంది. 
 
ఏపీ ప్రభుత్వం మనబడి .. నాడు–నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, షూ, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ అందిస్తోంది. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద పౌష్టికాహారం అందిస్తోంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు Amma Vodiని అందిస్తున్న సంగతి తెలిసిందే.

Also read: ఏపీలో కురుస్తున్న వర్షాలు.. నవంబర్ 6న మరో అల్పపీడనం.. తుపాన్‌గా మారే ఛాన్స్..

రాష్ట్రంలో విద్యార్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పాఠశాల విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. విద్యార్థులు పాఠశాలలకు రోజూ హాజరయ్యేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేందుకు, వారి హాజరును పెంచేందుకు వీలుగా ‘అమ్మఒడి’ పథకానికి హాజరును అనుసంధానం చేస్తోంది. 

బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేయడంతో.. అంతా పక్కాగా ఆన్‌లైన్‌లో రికార్డు అవుతుంది. విద్యార్థులు హాజరు తగ్గితే సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. దీంతో అమ్మ ఒడి పథకం దక్కాలంటే విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాల్సిందే. ఇక, ఇప్పటివరకు విద్యార్థులు పాఠశాలకు వస్తే ఉపాధ్యాయులు వారి హాజరును నమోదు  చేసేవారు.

Also read: డిప్యూటీ సీఎం నారాయణస్వామి నుంచి ఆ శాఖ తొలగింపు.. బుగ్గనకు అదనపు బాధ్యతలు..

ఆంధ్రప్రదేశ్ 61 వేలకు పైగా ఉన్న పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 6.49 లక్షల మంది, రెండో తరగతిలో 58 వేలకుపైగా చేరారు. వీరిలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరారు.

click me!