
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన సంగతి తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టుగా అధికారులు తెలిపారు. చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్దరాత్రి 1.30 గంటలకు చిరుత బోనులో చిక్కిందని తెలిపారు. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్దారించినట్టుగా చెప్పారు. శ్రీవారి భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం చేపట్టినట్టుగా తెలిపారు.
టీటీడీ నిర్ణయాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్పై కూడా భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. నడకమార్గంలో భక్తులకు కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదని చెప్పారు. షల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ను ఖండిస్తున్నట్టుగా తెలిపారు. అటవీశాఖ అధికారుల సూచనతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని తెలిపారు. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఇక, ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన టీటీడీ భక్తుల భద్రత చర్యలను మరింత పెంచాలని నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ.. చిరుతపులి దాడుల నుండి రక్షించడానికి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు కర్రలను అందజేస్తామని నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది. ఈ చర్యను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. భక్తుల కోసం పటిష్ట భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీని కోరుతున్నారు.