మీకది, మాకిది...ఏకంగా కేంద్రంలో అధికారాన్నే కాదని..: సజ్జలకు అయ్యన్న కౌంటర్

By Arun Kumar PFirst Published Sep 22, 2020, 12:50 PM IST
Highlights

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అంతే ఘాటుగా స్పందించారు. 

అమరావతి: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తారంటూ... ఇప్పటివరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీని ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంతే ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికన వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ సాగింది. 

''చంద్రబాబు గారి గతాన్ని ఒక్కసారి చూడండి. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఉండగా సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు. పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉండికూడా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయేవైపు పరుగెత్తారు. వెంటనే చొక్కా మార్చేసి కాషాయవాదిగా అవతారం ఎత్తారు'' అని సజ్జల ఆరోపించారు.
 
''2004లో ఎన్డీయే ఓడిపోయినప్పడు భవిష్యత్తులో ఎన్నడూ బీజేపీతో కలవనంటూ ఆ చొక్కావదిలేసి మళ్లీ సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు. 2014లో మోదీ గాలి ఉందనేసరికి మళ్లీ చొక్కా మార్చారు'' అన్నారు.

''2019లో కాకిలెక్కలు వేసి తానొక జాతీయ నాయకుడిగా, దేశ రక్షకుడిగా అవతారం ఎత్తారు. బోర్లాపడ్డాక తన ఎంపీలందర్నీ బీజేపీలోకి పంపి, ఢిల్లీ కరుణకోసం మళ్లీ చొక్కామార్చి తానొక కాషాయవాది అన్నట్టు కనికట్టు చేస్తున్నారు. మళ్లీ ఈ చొక్కాను ఏ క్షణానైనా చంద్రబాబు మార్చేయగలరు'' అంటూ వరుస ట్వీట్ల ద్వారా చంద్రబాబుపై, టిడిపి పై సజ్జల విమర్శలు చేశారు. 

read more  మూడు రాజధానులపై కేంద్రం జోక్యం: రాజ్యసభలో టీడీపీ

ఈ ట్వీట్లకు అదే ట్విట్టర్ వేదికన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమాధానమిచ్చారు. ''కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడటం వైసిపి చరిత్ర. యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ను రాష్ట్రపతిగా పెడితే మద్దతు ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం కోవింద్ ను పెడితే మద్దతు ఇచ్చింది. చంచల్ గూడ జైల్ నుంచి బెయిల్ కోసం సోనియా చుట్టూ తిరిగారు'' అని గుర్తుచేశారు.

''మళ్ళీ లోపలికి పంపకుండా ఎన్డీఏ చుట్టూ తిరుగుతున్నారు. టిడిపి ఆ రోజు ప్రణబ్ కు గాని సంగ్మా కు గాని మద్దతు ఇవ్వలేదు. తటస్థంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తేడా వస్తే కేంద్రంలో అధికారం కూడా వద్దనుకొని బయటకు వచ్చింది. వైసీపీకి కేసులు ముఖ్యం. టిడిపికి రాష్ట్రం ముఖ్యం'' అంటూ సజ్జలకు అయ్యన్న కౌంటరిచ్చారు. 


 

click me!