గుండ్రాయిలా వున్న విజయసాయికి కార్పోరేట్ వైద్యమా...అదీ పక్కరాష్ట్రంలో: అయ్యన్న ఫైర్

By Arun Kumar PFirst Published Jul 22, 2020, 10:45 AM IST
Highlights

కరోనా పాజిటివ్ గా తేలడంతో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లడాన్ని ప్రతిపక్ష టిడిపి నాయకులు తప్పుబడుతున్నారు.

అమరావతి: కరోనా పాజిటివ్ గా తేలడంతో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లడాన్ని టిడిపి నాయకులు తప్పుబడుతున్నారు. రాష్ట్ర  ప్రజలకు రాష్ట్రంలో అందిస్తున్న వైద్యంపై నమ్మకం కలిగించేలా ఇక్కడే కరోనా చికిత్స చేయించుకుంటే బావుండేదని అంటున్నారు. టిడిపి నాయకుడు, మాజీ మంత్రి అచ్చన్నాయుడికి కార్పోరేట్ వైద్యం అవసరం లేదంటూ అవమానించిన విజయసాయికి మాత్రం కార్పోరేట్ వైద్యం అవసరమొచ్చిందా అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. 
 
''ఎంపీ విజయసాయి రెడ్డి మనిషేనా? ఒక బీసీ నాయకుడిని ఘోరంగా అవమానించారు. ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రి కావాలా? ఈఎస్ఐ వద్దా అంటూ ట్వీట్లు పెట్టి హింసించారు సాయిరెడ్డి. మరి ఇప్పుడు ఆయనకి కరోనా పాజిటివ్ రాగానే ప్రత్యేక విమానంలో వైజాగ్ నుండి హైదరాబాద్ ఎందుకు పారిపోయారు'' అంటూ గతంలో విజయసాయి చేసిన ట్వీట్లను గుర్తుచేస్తూ అయ్యన్న మండిపడ్డారు. 

''వైకాపా నాయకులకు హైదరాబాద్ లో కార్పొరేట్ వైద్యమా? ప్రజలకేమో పులిహోర ప్యాకెట్ల వైద్యమా? ఏ గుండ్రాయిలా ఉన్న సాయిరెడ్డి విశాఖ కెజిహెచ్ లో ఎందుకు చేరలేదు?ఏపీలో అల్లుడు వైద్యం మీద నమ్మకం లేదా?'' అని ట్విట్టర్ వేదికన విజయసాయితో పాటు వైసిపి నాయకులను ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. 

read more  విజయసాయికి కరోనా..చాలా బాధాకరమన్న బుద్దా వెంకన్న

కరోనాతో బాధపడుతూ విజయసాయి రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉండడంతో ఆయన ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు ఓ ఆంగ్లదినపత్రిక తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

ఆ తర్వాత విజయసాయి రెడ్డి స్వయంగా ఓ ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలో భాగంగా తనంత తానుగా వారం నుంచి పది రోజుల క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప టెలిఫోన్ కు కూడా అందుబాటులో ఉండనని చెప్పారు. అయితే తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు మాత్రం చెప్పలేదు. 

ఇదిలావుంటే, విజయసాయి రెడ్డి వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కాలంలో విజయసాయి రెడ్డి అమరావతి, విశాఖపట్నం, హైదరాబాదుల మధ్య విస్తృతంగా పర్యటించారు. ఇటీవలి కాదా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు పలువురు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పలు సందర్భంగాల్లో మాస్కు లేకుండా కూడా కనిపించారు. 
 

click me!