
కర్నూలు : కర్నూలు జిల్లా పత్తికొండ-ఆదోని ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం ఆటో ఢీకొన్న ప్రమాదంలో పత్తికొండ ఎస్సై గోపాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాల తనిఖీలో భాగంగా రహదారి పక్కన ఎస్సై సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నీళ్ల క్యాన్లతో వేగంగా వచ్చిన ఆటో ఎస్సైని ఢీ కొట్టింది. సుమారు 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.
తీవ్ర గాయాలతో రహదారిపై పడిన ఎస్సైని హుటాహుటిన పోలీసు వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖం మీద కండరం చిట్లిపోవడంతో కుట్లు వేశారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఆటో డ్రైవర్ రామాజనేయులను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన జగన్.. కారణమిదే..
ఇదిలా ఉండగా, బీహార్లోని చప్రా-సివాన్ హైవేపై బుధవారం ఉదయం పోలీసులతో వెళ్తున్న బస్సు ఢీకొనడంతో ముగ్గురు బైకర్లు మృతి చెందారు. వివరాల్లోకి వెడితే.. పోలీసు సిబ్బందితో వెడుతున్న బస్సు బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన చప్రా సివాన్ హైవేపై చోటు చేసుకుంది. ఆ బస్సులో బీహార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీకొనడంతో.. వారిలో ఒకరు బైక్ తో సహా బస్సు కింద ఇరుక్కుపోయారు.
దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలింది. అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఆ ముగ్గురు వ్యక్తులు బస్సు కిందికి రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు కింద ఇరుక్కున్న బైకర్ తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో పోలీసు అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సితాబ్దియారాలో దివంగత రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ 120వ జయంతి వేడుకల్లో పాల్గొని పోలీస్ సిబ్బంది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బస్సు ఢీ కొన్న తరువాత బైకర్లలో ఒకరు బస్సు కింద ఇరుక్కుని, సుమారు 90 మీటర్ల వరకు ఈడ్చుకు పోబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈ విషాద వార్త అందర్నీ కలిచి వేస్తోంది.