టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కోడలు నారా బ్రాహ్మణికి కౌంటర్ ఇచ్చారు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలన్నారు. చంద్రబాబు ఏడాది పాటు జైలులో వుండి బయటకు వచ్చేటప్పుడు నిజాయితీగా వస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు గతంలో 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని పోసాని ఆరోపించారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన విషయాన్ని కృష్ణమురళీ గుర్తుచేశారు. చంద్రబాబుకు దోమల మందు, ఏసీ, దోమల తెరను తాను కొనిస్తానంటూ సెటైర్లు వేశారు.
నారా బ్రహ్మణి మాటలు విని నవ్వుకోవాలంటూ పోసాని కౌంటరిచ్చారు. ఆమె మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీ తాతను వెన్నుపోటు పొడిచిందెవరు..? మీ తాతను చెప్పుతో కొట్టిందెవరు..? మీ తాతను చంపిందెవరు..? అనే ప్రశ్నలకు బ్రాహ్మణి సమాధానం చెప్పాలని పోసాని సవాల్ విసిరారు. రామారావును వెన్నుపోటు పొడిచింది.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది ప్రజల కోసమేనా అంటూ కృష్ణమురళి సెటైర్లు వేశారు. అవినీతి పనులు చేస్తేనే జైల్లో పెడతారని.. అక్కడ ప్రశాంతంగా ఏడాదో, ఏడాదిన్నరో వుండొచ్చు కదా అంటూ పోసాని చురకలంటించారు.
ALso Read: అసత్యాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టుకతోనే వచ్చింది.. ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షిని: మోహన్బాబు
ఇకపోతే.. చంద్రబాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు భద్రతలో ఏదైనా లోపం జరిగితే దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని మంత్రి చెప్పారు. టీడీపీ అధినేత అరెస్టు విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న చంద్రబాబు తనపై వస్తున్న ఆరోపణలు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రమేయం లేదని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.
అలాగే, ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న మహిళా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మహిళా బిల్లుకు తాము అనుకూలంగా ఉన్నామనీ, విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిలా రిజర్వేషన్ల బిల్లుకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలిపారు. మహిళలకు కోసం తమ ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దీనిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలు తాము కేటాయించామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.