ఆ దమ్ము ఏ1, ఏ2లకు ఉందా?: జగన్, విజయసాయిలకు అచ్చెన్న సవాల్

By Arun Kumar PFirst Published Feb 21, 2021, 7:56 AM IST
Highlights

ఢిల్లీలో చేయాల్సిన పోరాటం గల్లీలో చేయడం ఏంటి? అంటూ స్టీల్  ప్లాంట్ కోసం వైసిపి ఏర్పాటుచేసిన సభపై అచ్చెన్న ప్రశ్నించారు. 

అమరావతి: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కేంద్రాన్ని ప్రశ్నించలేకే వైజాగ్ లో బహిరంగ సభ పెట్టి తమ తప్పును ఒప్పుగా చేసుకునే పనిలో వైసిపి నేతలు నిమగ్నమయ్యారని టీడిపి ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై ఢిల్లీలో బహిరంగ సభ పెట్టే దమ్ము ఏ1, ఏ2లకు ఉందా? ఢిల్లీలో చేయాల్సిన పోరాటం గల్లీలో చేయడం ఏంటి? అని అచ్చెన్న ప్రశ్నించారు. 

''విజయసాయిరెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం ఊసరవెల్లి రాజకీయం కాదా? ప్రైవేటీకరణ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఎందుకు చేయటం లేదు? పాదయాత్ర చేసి విజయసాయిరెడ్డి సాధించింది శూన్యం. మీ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగింది ఏంటి?  కోర్టు కేసులు ఉండటం వల్ల విశాఖ ఉక్కు గనులు ఇవ్వలేకపోతున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం దుర్మార్గం. ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్లు మీ అనుయాయులకు ఒబుళాపురం గనులు దోచిపెట్టి ఇప్పుడు మాత్రం కోర్టులో ఉన్నాయని మాట్లాడటం సిగ్గుచేటు'' అని అచ్చెన్న మండిపడ్డారు. 

''విశాఖలో సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ కోసమా... చంద్రబాబు నాయుడిని తిట్టడానికా? అధికారంలో ఉన్నది ఎవరు? పోరాటం చేయాల్సింది ఎవరు? ప్రతిపక్షం మీద నెపం నెట్టి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. పోస్కోతో రహస్య ఒప్పందాలు చేసింది మీరు. మీ కేసుల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా టీడీపీపై నోరు పారేసుకోవడం విజయసాయిరెడ్డి దివాళాకోరుతనం. ప్రజలకు సమాధానం చెప్పలేనప్పుడల్లా తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టడం వైసీపీకి అజెండాగా మారింది'' అని అన్నారు. 

read more   "అమ్మటానికి వాడెవ్వడు-కొనటానికి వీడెవ్వడు"...ఏమయ్యాయి:ప్రధానికి చంద్రబాబు లేఖపై అంబటి

''సీఎం జగన్ నేలబారు రాజకీయాలకు వైజాగ్ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏ2 రెడ్డి పాదయాత్ర పేరుతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నారు. అసలు బహిరంగ సభ ఎందుకు పెట్టారో ప్రజలకు అర్ధం కావడం లేదు. ప్రధాన మంత్రితో నిర్వహించిన నీతి ఆయోగ్ వర్చువల్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ రెడ్డి కనీసం ప్రస్తావించకపోవడం అత్యంత దుర్మార్గం'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

''విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం గురించి ప్రధాన మంత్రి వద్ద జగన్ ఎందుకు స్పందించలేదు?  2020 సెప్టెంబర్ లో వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా నలుగురు ఎంపీలు పోస్కో ప్రతినిధులతో కలిసి కేంద్ర ఉక్కు శాఖా మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ను కలవడం వాస్తవం కాదా.? ప్రైవేటీకరణకు చేయాల్సిన తంతు పూర్తి చేసి నేడు వైజాగ్ ప్రజల ముందు కళ్లబొల్లి కబుర్లు చెప్పడం హేయం'' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  
 

click me!