దాన్ని వీడకుంటే.. ఆ దేవుడే జగన్ మదాన్ని అణగదొక్కుతారు: అచ్చెన్న హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jan 1, 2021, 11:50 AM IST
Highlights

ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 

గుంటూరు: ప్రజల ముందు, టీవీల ముందు ఆదేవుడి దయతో అని చెప్పడం కాదు... దేవుళ్లకు జరుగుతున్న అవమానాలపై సీఎం జగన్ రెడ్డి స్పందించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవునిపై ఎందుకు లేదు? అని అచ్చెన్న ప్రశ్నించారు.

''హిందూ దేవాలయాలపై జరుగతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్నటి రామతీర్థం ఘటన మరువకముందే ఇప్పుడు రాజమండ్రిలో విఘ్నేశ్వరాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చేతులు విరగొట్టారు. జగన్ రెడ్డి మొద్దు నిద్ర వీడి హిందూ దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి'' అని అచ్చెన్న సూచించారు.

''ఏపీలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మొదటి ఘటనలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టి వుంటే ఇన్ని దాడులు జరిగేవి కాదు. జగన్ పాలనలో ప్రజలకే కాదు..దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. అహంకారాన్ని వీడకపోతే ఆ దేవుడే మీ మదాన్ని అణగదొక్కుతారు'' అని హెచ్చరించారు.

read more  నిన్న శ్రీరాముడు...నేడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి...ఏపీలో ఆగని విగ్రహాల ధ్వంసం

''కనీసం ఒక్కనాడైనా ఇలాంటి ఘటనలపై జగన్ రెడ్డి స్పందించారా? అంతర్వేది రథం దగ్ధంపై వేసిన సీబీఐ విచారణలో పురోగతి లేదు. ప్రజల మనోభావాలను కాపాడలేని వాళ్లు పదవుల్లో కొనసాగే అర్హత లేదు. దేవాదాయ శాఖా మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థం కావడం లేదు'' అని మండిపడ్డారు.

''మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవుడిపై ఎందుకు లేదు? దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై తక్షణమే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించి నిందితులను కఠినంగా శిక్షించాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తాం'' అని అచ్చెన్న  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

click me!