వచ్చేది చంద్రబాబు పాలనే.. వాళ్ల తాట తీస్తాం: మహానాడులో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 27, 2022, 05:17 PM ISTUpdated : May 27, 2022, 05:36 PM IST
వచ్చేది చంద్రబాబు పాలనే.. వాళ్ల తాట తీస్తాం: మహానాడులో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీ పాలనలో పడిన కష్టం గత 40 ఏళ్లలో ఎప్పుడూ పడలేదన్నారు టీడీపీ  ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తమను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారి తాట తీసేలా రాబోయే చంద్రబాబు పాలన ఉంటుందని ఆయన హెచ్చరించారు. 

ఒంగోలులో జరుగుతున్న మహానాడు (mahanadu) కార్యక్రమంలో టీడీపీ (tdp) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) మాట్లాడారు. ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందని, టీడీపీ పుట్టి 40 ఏళ్లు పూర్తయిందని ఆయన గుర్తుచేశారు. ఈ ఏడాది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ శత జయంతి (ntr 100th birthday) కూడా కావడం వల్ల ఈ మహానాడు చాలా ప్రత్యేకమైనదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తమ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేసే పార్టీ కాదని... అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండే పార్టీ అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Also Read:కోడికత్తితో డ్రామాలు.. గొడ్డలిపోటును గుండెపోటన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం కోనసీమలో రాజకీయం : చంద్రబాబు

ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో తాము పడిన కష్టం గత 40 ఏళ్లలో ఎప్పుడూ పడలేదని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ (ys jagan) వల్ల పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. టీడీపీ అంటే గాలికి పుట్టిన పార్టీ కాదని... ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని అన్నారు. టీడీపీ లేకుండా చేయడం నీకు, నీ తండ్రికి, నీ తాతకు ఎవరికీ సాధ్యం కాదంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గత మూడేళ్లలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారి తాట తీసేలా రాబోయే చంద్రబాబు పాలన ఉంటుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను, రౌడీషీట్ లను ఒక్క సంతకంతో కొట్టేస్తారని పేర్కొన్నారు. 

వైసీపీ పాలనలో భయపడ్డ కార్యకర్తలకు చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు పర్యటనలకు ఉత్తరాంధ్రకు మించి రాయలసీమలో స్పందన వచ్చిందని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో 160 స్థానాలలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రలో అలీబాబా 40 దొంగలు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. బలహీన వర్గాలు టీడీపీకి చేరువవుతున్నాయనే భయంతోనే వైసీపీ బస్సు యాత్రను (ysrcp ministers bus yatra) చేపట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu