AP SSC Result 2022: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ ( సోమవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు పదో పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ డైరెక్టర్ Devanand Reddy ఒక ప్రటనలో తెలిపారు. ఇక ఫలితాలు గ్రేడ్ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు అధికారులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అధికారులు ఫలితాలను విడుదల చేసిన తర్వాత https://www.bse.ap.gov.in/ వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. గత రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
అయితే ముందుగా ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అధికారులు, మంత్రి, సిఎంవోల సమన్వయ లోపంతో ఒకసారి వాయిదా పడ్డాయి. దీంతో కొన్ని అనివార్య కారణాల వల్ల శనివారం పదో తరగతి ఫలితాలు విడుదల చేసే కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. తల్లిదండ్రులు గమనించగలరని దేవానంద్ రెడ్డి తెలిపారు. చివరి క్షణంలో ఫలితాలు వాయిదా పడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు.
పదో తరగతి పరీక్షలను వాయిదా వేయడంతో ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, అధికారులకు మధ్య సమన్వయ లోపంతోనే ఫలితాల విడుదల వాయిదా వేయాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. మొత్తం 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు హాజరయ్యారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు మాత్రమే ప్రకటిస్తారు. గతంలో ఉన్న గ్రేడింగ్ పద్ధతికి బదులు.. 2020 నుంచి విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు.
మరోవైపు పరీక్షల ఫలితాలు వెలువరించాక.. విద్యాసంస్థలు, పాఠశాలలు తమ విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలు ఇవ్వకూడదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జూన్ 1న 83వ నంబరు జీవో జారీచేశారు. ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997 ప్రకారం ఇటువంటి మాల్ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు.