
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోం శాఖ.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. ఈ నెల 17న విభజన సమస్యలపై సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలిపింది. పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
ఈనెల 8న జరిగిన సమావేశంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును నియమించింది. ఈనెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహణకు సిద్దమైంది. దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించున్నారు.
ఇక, ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. అజెండాలోని అంశాలు
1. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
2. ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్ పంపిణీ
3. రెండు రాష్ట్రాల మధ్య పన్ను బకాయిలు
4. రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
5. ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన
6. రాయలసీయ, ఉత్తరాంధ్ర 7 వెనకబడిన జిల్లాల అభివృద్దికి గ్రాంట్
7. ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
8. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ
9. పన్ను ప్రోత్సహకాలు