స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణ అక్టోబర్ 4కు వాయిదా

Siva Kodati | Updated : Sep 27 2023, 05:25 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది ఏసీబీ కోర్ట్. 

Google News Follow Us

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది ఏసీబీ కోర్ట్. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఒకేసారి వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. అలాగే చంద్రబాబుపై పెండింగ్‌లో వున్న పీటీ వారెంట్లపైనా అదే రోజు విచారిస్తామని తెలిపింది. 

అంతకుముందు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సీజేఐ బెంచ్‌కు చేరింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. జస్టిస్ భట్టి, ఖన్నా బెంచ్ వేరే బెంచ్‌కు బదిలీ చేయడంతో సీజేఐని ఆశ్రయించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు సిద్ధార్థ్ లూథ్రా. త్వరగా లిస్ట్ చేయాలన్నదే తమ మొదటి అభ్యర్దన అని ఆయన పేర్కొన్నారు.

Also Read: సీజేఐ బెంచ్ ముందుకు చంద్రబాబు పిటిషన్.. విచారణ మంగళవారానికి వాయిదా

మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్ధన అని సిద్ధార్థ్ తెలిపారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న చీఫ్ జస్టిస్.. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. అక్టోబర్ 3న అన్ని విషయాలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.