ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటనను రైతు సంఘం ఖండించింది. రైతులకు ఉరితాడుగా పరిణమించనున్న మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
త్వరలో రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేస్తామంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ రైతు సంఘం స్పందించింది. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డీబేట్లో పాల్గొన్న సందర్భంగా రైతు సంఘం ప్రతినిధులు సీఎం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు మోటార్లకు మీటర్ల ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్ ఎలా వస్తుందో చెప్పాలంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేవలం 7 గంటల పాటు సాగుకు విద్యుత్ ఇస్తూ నిరంతర సరఫరా అంటూ ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని రైతు సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్ట పంటలకు వ్యవసాయ మోటార్లే ప్రధానమన్న రైతు సంఘం... మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకమని ప్రకటించింది. రైతులకు ఉరితాడుగా పరిణమించనున్న మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సంఘం ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా.. శుక్రవారం వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్పై వైసీపీ అధినేత (ysrcp) , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) కీలక ప్రకటన చేశారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు (agricultural motors) ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ దిశగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందన్న జగన్... రైతులకు మెరుగైన విద్యుత్ ఇవ్వగలమని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సాగు మోటార్లకు మీటర్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
సమీక్షలో భాగంగా రైతు భరోసా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై జగన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన జగన్... జూన్ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామని చెప్పారు. అదే నెలలో 3 వేల ట్రాక్టర్లు సహా, 4014 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామని, 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.