
తిరుమలలో శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి ఆక్టోపస్ క్యూఆర్టీ (క్విక్ రియాక్షన్ టీమ్)తో భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ప్రకటన చేశారు. తిరుమల ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆక్టోపస్ అధికారులతో కలిసి డీఐజీ అమ్మిరెడ్డి పరిశీలించారు. తిరుమల ఆలయం వద్ద పటిష్ట భద్రత కోసం ఆక్టోపస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు.
శ్రీవారి ఆలయం ప్రవేశమార్గంలో వద్ద ఆక్టోపస్ టీమ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ చాంబర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇందులో 5 నుంచి ఆరుగురు సభ్యులతో ఆక్టోపస్ బృంద.., సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బుల్లెట్ప్రూఫ్ జాకెట్స్, డే-విజన్ గ్లాసెస్, అత్యాధునిక ఆయుధాలతో శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటారని డీఐజీ తెలిపారు. వీరు శ్రీవారి ఆలయ ముఖద్వారాన్ని ప్రధానంగా రక్షిస్తారని చెప్పారు. ఈ బృందం 24 గంటలు నిరంతరాయంగా షిప్టుల వారీగా పనిచేస్తుందన్నారు. ఇక, ఆక్టోపస్ టీమ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ చాంబర్ ఏర్పాటు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
టీటీడీ, ఇతర అనుబంధ భద్రతా విభాగాల సమన్వయంతో పోలీసు శాఖ నిరంతరంగా శ్రీవారి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను అప్గ్రేడ్ చేస్తోందని అమ్మిరెడ్డి చెప్పారు. తిరుమలలో భద్రతను మరింత పెంచేందుకు జూన్లో జరిగిన ఆలయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసి, వారికి నిర్దిష్ట పనులను కేటాయించిందని తెలిపారు. ఈ కమిటీల నుంచి పూర్తిస్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా టీటీడీ దృష్టికి తీసుకువచ్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.