అప్పుడు అమరావతికి జైకొట్టి.. ఇప్పుడెందుకిలా, చేతకాని నిర్ణయాలొద్దు: జగన్‌కు శైలజానాథ్ సలహా

By Siva KodatiFirst Published Sep 12, 2022, 3:47 PM IST
Highlights

ఏపీ రాజధాని అంశంలో సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు జై కొట్టిన జగన్.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

ఏపీ రాజధాని అంశంలో సీఎం వైఎస్ జగన్ వైఖరిపై స్పందించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అందరికీ అందుబాటులో వుండాలనేది కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. ఈ భూమిపై రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు జై కొట్టిన జగన్.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

ఏపీ మంత్రులు మూడు రాజధానులు తప్పదన్నట్లుగా మాట్లాడుతున్నారని.. ఇదంతా ఎవరి కోసమని శైలజానాథ్ నిలదీశారు. అమరావతి రాజధానిని చంపేసి , మూడు రాజధానులు అనడం సరైన నిర్ణయం కాదని ఆయన హితవు పలికారు. తలతిక్క వ్యవహారాలు, చేతకాని నిర్ణయాలను పక్కనబెట్టి ... రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని శైలజానాథ్ కోరారు. మూడు రాజధానులు అన్నది ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికేనని ఆయన ఆరోపించారు. 

Latest Videos

ALso REad:మూడు రాజధానులు జరిగి తీరుతాయ్.. 2024లోపే బిల్లు : తేల్చేసిన కొడాలి నాని

మరోవైపు.. అమరావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు ఈ  నెల 9వ తేదీన అనుమతిని ఇచ్చింది. దీంతో రైతులు ఇవాళ ఉదయం అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి పాదయాత్రను ప్రారంభించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని  అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాయి. దీంతో అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించనున్నారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.
 

click me!