గాలికి మద్దతుగా ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు
కర్ణాటక లో ఎన్నికల పర్వం మొదలైంది. కర్ణాటకలోని తెలుగు వారంతా బీజేపీకి ఓటు వేయవద్దంటూ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. కాగా ఈ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో గాలి జనార్థన్ రెడ్డి అనుచరులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, విజయసాయిరెడ్డి, కడప నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఏపీ భవన్లో వైసీపీ ఎంపీలు దీక్షలు చేస్తుంటే విజయసాయిరెడ్డి, విజయలక్ష్మి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీయకుండా చంద్రబాబును విమర్శిస్తున్నారంటూ జగన్ తీరుపై దేవినేని మండిపడ్డారు. తన అనుచరులతో బూతులు తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెప్పారు.