చర్చల కోసం ఇక ఎదురుచూపుండవ్: ఉద్యోగ సంఘాల నేతలపై మంత్ర బొత్స ఫైర్

By narsimha lodeFirst Published Jan 28, 2022, 2:41 PM IST
Highlights

చర్చలకు రావాలని పిలుస్తున్నా కూడా ఉద్యోగ సంఘాల నుండి స్పందన లేకపోవడంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. ఇక నుండి చర్చల కోసం ఎదురుచూపులుండవన్నారు. చర్చలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరితేనే చర్చిస్తామన్నారు.
 

అమరావతి: PRC సాధన సమితితో చర్చల కోసం  ఎదురు చూపులుండవని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.శుక్రవారం నాడు అమరావతిలో  Botsa Satyanarayana మీడియాతో మాట్లాడారు. Employees Unionsతో చర్చించేందుకు తాము నాలుగు మెట్లు దిగడానికి కూడా సిద్దంగా ఉన్నామని  ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy వ్యాఖ్యలను అలుసు తీసుకొన్నారని మంత్రి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలుంటాయని ఆయన తేల్చి చెప్పారు. చర్చల కోసం ఉద్యోగ సంఘాల కోసం ఎదరు చూపులుండవని ఆయన స్పష్టం చేశారు. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.

 ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారంగా   ఏ ఒక్కరికి కూడా రూపాయి తగ్గదని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే  చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు. మనలో మనం  ఘర్షణ పడొద్దని మంత్రి సూచించారు.

జీతాలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో ఒకటో తేదీన వచ్చే పే స్లిప్ లో తెలుస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ జీతాలు వద్దని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయన్నారు.ఉద్యోగ సంఘాలు ఏమనుకొంటున్నాయో అర్ధం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందన్నారు. సీనియర్ మంత్రులు వచ్చి కూర్చోన్నా కూడా ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవడం బాధాకరమన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. అంతేకాదు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు దఫాలు ఉద్యోగులను చర్చలకు పిలిచింది. అయితే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు హాజరౌతామని చెప్పారు.

click me!