తోలుబొమ్మ మంత్రివర్గం, కీలుబొమ్మ పాలన... ఆ ఐదుగురు రెడ్లదే పెత్తనం..: జగన్ పాలనపై యనమల ధ్వజం

By Arun Kumar PFirst Published Jan 28, 2022, 12:56 PM IST
Highlights

వైసిపి ప్రభుత్వ పాలనలో కేవలం రెడ్ల పెత్తనమే నడుస్తోందని... మంత్రులంతా కీలుబొమ్మలుగా మారిపోయారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అయితే జగన్ లేదంటే ఆ ఐదుగురు రెడ్లే పెత్తనం సాగిస్తున్నారని అన్నారు. 

అమరావతి: ఏపీ సీఎం జగన్, మంత్రులపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (yanamala ramakrishnudu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి (YS Jagan) మంత్రివర్గం ‘‘పప్పెట్ కేబినెట్’’ గా మారిందని... ముఖ్యమంత్రి తప్ప మిగిలిన వారంతా తోలుబొమ్మలేనని యనమల అన్నారు. మంత్రులకు ఎటువంటి అధికారాలు లేవని... మొత్తం అధికారాలన్నీ సిఎం చేతిలోనే పెట్టుకున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేకం, పాలనా విరుద్ధ ప్రభత్వమని యనమన మండిపడ్డారు. 

''మంత్రులెవ్వరూ కనీసం నోరువిప్పి మాట్లాడలేని పరిస్థితి. జగన్ ముందు ‘మే..మే’ అనడం... బైటకొచ్చి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu)పై గాండ్రించడం రెండున్నరేళ్లుగా చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతిదానికీ సలహాదారులే స్పందిస్తున్నారు. అది ప్రభుత్వ శాఖల సమాచారమైనా, ఉద్యోగవర్గాల అంశమైనా మాట్లాడేది అడ్వయిజర్లే... మంత్రుల నోళ్లు కట్టేశారు, సలహాదారులే పెత్తనమంతా.. దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy), విజయసాయిరెడ్డి (vijayasai reddy)లే...రాష్ట్రం లోపల సజ్జల, వెలుపల విజయసాయి పెత్తనం చలాయిస్తున్నారు'' అని యనమల పేర్కొన్నారు. 

''జగన్ ఒంటెత్తు పాలనలో ఏ మంత్రి కూడా మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. సజ్జల మాట్లాడుతుంటే వెనకాల బొత్స, బుగ్గన, పేర్ని నిలబడటం కన్నా ఘోరం లేదు. నామ్ కే వాస్తే మంత్రులు... పెత్తనం అంతా సలహాదారులదే. సలహాదారులు మాట్లాడుతుంటే మంత్రులు నోరెళ్లబెట్టి చూడటం సిగ్గుచేటు'' అన్నారు. 

''వైసిపి (YSRCP) పాలకులు ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు... రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ఉద్యోగుల సమ్మె ఉదంతంపై మంత్రుల స్పందన ఎలాఉందో చూశాం. అదేకాదు ప్రతి శాఖలోనూ మంత్రులు ఉత్సవ విగ్రహాలే. ఇలాంటి తోలుబొమ్మ మంత్రివర్గం, కీలుబొమ్మ పాలన దేశచరిత్రలో చూడలేదు. తనశాఖ ప్రగతిని ప్రజలకు చెప్పే స్వేచ్ఛ కూడా మంత్రులకు లేకుండా చేశాడు. అసలు పురోగతి ఉంటే కదా చెప్పుకోడానికి..? రెండున్నరేళ్లుగా అంతా తిరోగమనమే'' అంటూ అయ్యన్న ఎద్దేవా చేసారు. 

''ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాశనం అయ్యింది. ఉద్యోగవర్గాల ఆందోళనలతో పరిపాలన మొత్తం పడకేసే స్థితికి చేరింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన 20మంది అధికారుల బృందంలో బుగ్గన ఉన్నాకూడా ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి మాట్లాడాడే తప్ప బుగ్గన నోరువిప్పలేదు. ఆయన లోపల క్షోభ పడుతున్నా బైటకు మిన్నకున్నారు. ఢిల్లీలో పెత్తనం విజయసాయిరెడ్డిదే. పొలిటికల్, అఫిసియల్ మేనేజిమెంట్ అంతా విజయసాయిదే.. మంత్రి బుగ్గనను మరబొమ్మ చేశారు'' అన్నారు.

''అన్ని అంశాల్లో ఐదుగురు రెడ్లదే పూర్తి పెత్తనం సాగుతోంది. ఏమున్నా విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే చూసుకుంటారు. అసలు కేబినెట్ ను అటకెక్కించి కిచెన్ కేబినెట్ నడుపుతున్నాడు. సెక్రటేరియట్ కు కూడా పోకుండా తాడేపల్లి కిచెన్ నుంచే జగన్ పాలన నడుస్తోంది. జగన్ పాలన, కిచెన్ పాలన అయ్యింది, నమ్మినవాళ్లంతా పొయ్యిలో పడ్డారు'' అని యనమల మండిపడ్డారు. 

''ఉత్సవ విగ్రహాల్లా మారిన మంత్రులు చంద్రబాబును తిట్టడానికే తప్ప పాలనాంశాల్లో భాగస్వామ్యం లేదు. కేబినెట్ నిర్ణయాల్లో అసలు మంత్రులకు భాగస్వామ్యం లేదు. జగన్ మంత్రులు రబ్బరు స్టాంపు మంత్రులుగా తయారయ్యారు. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్దిని పూర్తిగా అటకెక్కించారు. అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కారు'' అని విమర్శించారు. 

''రాష్ట్రాన్ని 26జిల్లాలు చేస్తున్నాడు, ఒక్క జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టలేదు. ఒక్క జిల్లాకు బిసి నాయకుడి పేరు పెట్టలేదు. గౌతు లచ్చన్న వంటి ఉద్ధండులు బీసిల్లో అనేకమంది ఉన్నా ఒక్క జిల్లాకు బీసి నాయకుడి పేరు పెట్టకపోవడం జగన్ బీసి వ్యతిరేక నైజానికి నిదర్శనం'' అన్నారు. 

''రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎట్లా ఖూనీ అవుతుందో జగన్ పాలనే తార్కాణం. పప్పెట్ కేబినెట్ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి జగన్ కేబినెట్ ఉదాహరణ. ఉద్యోగుల న్యాయబద్దమైన డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడంలేదు..? పాత జీతాలే ఇవ్వమని కోరినా మొండిగా వ్యవహరించడం ఏమిటి..? కొత్త పిఆర్సి నివేదిక బైటపెట్టడానికి అభ్యంతరం ఎందుకు..? టిడిపి ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన మేళ్లను నిలిపేయడం, రివర్స్ చేయడం కన్నా దివాలాకోరుతనం ఏముంది..?'' అంటూ మండిపడ్డారు. 

''అభివృద్దిని రివర్స్ చేశారు, పెట్టుబడులను రివర్స్ చేశారు, ఎంప్లాయిమెంట్ ను రివర్స్ చేశారు, వెల్ఫేర్ ను రివర్స్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ ను రివర్స్ చేశారు..ఇక మిగిలింది జగన్ రెడ్డిని రివర్స్ చేయడమే..అది ఎంతో దూరంలో లేదు. జగన్ రెడ్డి బాధితులే ఆపని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు'' అని మాజీ ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. 
 

click me!