డీఎస్సీ పరీక్షను పెళ్లైన మహిళలు కూడా రాసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్లో భర్త ఇంటి పేరు వాడాలా? లేదా నాన్న ఇంటి పేరు వాడాలా? అన్నది అనేక మందిలో అనుమానం ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. పెళ్లైన మహిళలు తమ సర్టిఫికేట్లలో ఏ ఇంటి పేరు ఉంటే ఆ ఇంటి పేరునే దరఖాస్తులో నింపాలని సూచించారు. సర్టిఫికేట్లలో ఏది ఉంటే.. ఆ ఇంటి పేరునే పరిగనణలోకి తీసుకుంటామని తెలిపారు.
మెగా డిఎస్సీ -2025 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా విజయవాడలోని పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రారంభించినట్లు తెలిపారు. అభ్యర్థులు హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మెగా డిఎస్సీ -2025 దరఖాస్తు నింపే సందర్భంలో అభ్యర్ధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులు పలు సూచనలు చేశారు.
అభ్యర్థులు ఒకే అప్లికేషన్లోనే తమ అర్హతలు బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒకే పోస్టుకు ఒక జిల్లాలో లోకల్ మరొక జిల్లాలో నాస్ లోకల్ కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పారు. అనగా.. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తు ఫారంలో ఒకటి, రెండు విభాగాలను ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఫీజు చెల్లించిన తర్వాత ఎడిటింగ్ చేసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇక టెట్ మార్కుల వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ అప్లకేషన్లో ఒక్కసారి వివరాలు తప్పుగా నమోదు చేసి ఫీజు చెల్లించేస్తే ఇక సరిచేయడం కుదరదని అంటున్నారు. కాబట్టి.. అభ్యర్థి పేరు, చదువు, ఇతర అర్హతలు, వివరాలు నమోదు చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని చెబుతున్నారు అధికారులు.